రియల్‌ ‘ప్యాడ్‌మేన్‌’ లేఖ

9 Feb, 2018 15:50 IST|Sakshi
ప్యాడ్‌మేన్‌ షూటింగ్‌లో అక్షయ్‌ కుమార్‌, మురుగనాథమ్‌

సాక్షి, ముంబై: తన జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో సినిమా తెరకెక్కించినందుకు రియల్‌  ‘ప్యాడ్‌మేన్‌’  అరుణాచలం మురుగనాథమ్‌ ధన్యవాదాలు తెలిపారు. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ‘ప్యాడ్‌మేన్‌’ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తం‍గా విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు మురుగనాథమ్‌ భావోద్వేగపూరిత లేఖ రాశారు. తన జీవితంగా ఆధారంగా సినిమా వస్తుందని తాను ఊహించలేదని పేర్కొన్నారు. ఈ చిత్రం అందరినీ అలరిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తన భార్య సహకారంతోనే చౌక ధర శానిటరీ న్యాప్‌కిన్‌ తయారీ సాధ్యమైందని పేర్కొంటూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

భారీ విడుదల
శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 3350 స్క్రీన్లపై ‘ప్యాడ్‌మేన్‌’ విడుదలైంది. రష్యాలో విడుదలైన తొలి బాలీవుడ్‌ సినిమాగా నిలిచింది. ఒడిశాలో ఈ సినిమా ప్రదర్శించబడుతున్న ధియేటర్‌ వెలుపల శానిటరీ న్యాప్‌కిన్‌ పంపిణీ స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఈ సినిమా బాగుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సామాజిక సమస్యను ప్రజలను చైతన్యవంతం చేసేలా ఈ చిత్రం ఉందని, అందరూ చూడాల్సిన సినిమా అంటున్నారు.

అసాధారణ కృషీవలుడు..
తమిళనాడుకు చెందిన అరుణాచలం మురుగనాథమ్‌ తన అసాధారణ కృషితో  మూడున్నర కోట్ల శానిటరీ న్యాప్‌కిన్‌ మెషిన్‌ను కేవలం రూ. 65 వేలకే తయారు చేశాడు. దాని సహాయంతో స్వయం సేవా సంఘాల ద్వారా 29 రాష్ట్రాలు ఉన్న మన దేశంలోని 23 రాష్ట్రాలలో ప్యాడ్స్‌ను చాలా చవకగా అమ్ముతున్నాడు. ఆయన సేవలకుగాను 2016లో ఆయనను కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

మరిన్ని వార్తలు