వారినీ అంగీకరించాలి

5 Feb, 2019 08:20 IST|Sakshi

తమిళసినిమా:  అలాంటి వారినీ అంగీకరించాలి అంటోంది నటి రెజీనా. కోలీవుడ్, టాలీవుడ్‌లో నటిగా ఒక టైమ్‌లో రాణించిన ఈ బ్యూటీకి ఇప్పుడు ఈ రెండు భాషల్లోనూ అవకాశాలు తగ్గాయి. ఆ మధ్య నటించిన మిస్టర్‌ చంద్రమౌళి చిత్రంలో విచ్చలవిడిగా అందాలను ఆరబోసినా, వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న చందాన ఆ చిత్రం సక్సెస్‌ కాకపోవడం పైగా రెజీనా విమర్శలను మూటగట్టుకుంది. కాగా ఈ జాణ బాలీవుడ్‌లో సంచలన నటిగా మారింది. అక్కడ ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఐసా లగా చిత్రంలో నటించింది. ఇందులో నటి సోనం కపూర్‌ను ప్రేమించే లెస్బియన్‌గా నటించింది. గత నెలలో తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో లెస్బియన్‌గా నటించిన నటి రెజీనా ధైర్యానికి మెచ్చుకుంటున్న వాళ్లు కొంతమంది అయితే విమర్శించేవాళ్లూ అదే స్థాయిలో ఉండటం విశేషం. దీని గురించి మనసు విప్పిన రెజీనా సమాజానికి ఏం చెబుతుందో చూద్దాం.

ఒక నటిగా ఎలాంటి పాత్రనైనా నటించడానికి సిద్ధంగా ఉండాలి. నేను దక్షిణాది నటిగా మాత్రమే ఉండాలనుకోవడం లేదు. హింది సినిమాల్లోనూ తన ప్రతిభను చాటుకోవాలనుకుంటున్నాను. అందుకే ఆ చిత్రంలో లెస్బియన్‌గా నటించడానికి కూడా వెనుకాడలేదు. నటిగా నేను ఎల్లలు అధిగమించాలని కోరుకుంటున్నాను. అయినా మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాం. కాలం మారుతోంది. లెస్బియన్ల జీవితాలను అంగీకరించాలి. ఎవరు ఎలా జీవించాలని కోరుకుంటే వారిని అలా జీవించనివ్వాలి. సుప్రీంకోర్టే హిజ్రాలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాని గురించి చర్చ జరుగుతున్నా, సమాజంలోనూ మార్పు వస్తోంది. ఇదే విషయాన్ని నేను నటించిన హింది చిత్రంలో చర్చించాం అని నటి రెజీనా పేర్కొంది. ఏదేమైనా లెస్బియన్‌ పాత్రలో నటించి మరోసారి వార్తల్లోకెక్కిన ఈ బ్యూటీకి ఈ సారి అయినా అవకాశాలు వస్తాయా? అన్నది వేచి చూడాలి.

మరిన్ని వార్తలు