అంతరిక్ష ప్రయాణానికి డేట్‌ ఫిక్స్‌

13 Jul, 2018 01:23 IST|Sakshi
వరుణ్‌ తేజ్‌

వరుణ్‌ తేజ్‌ అంతరిక్ష ప్రయాణం పూర్తి చేసి తనకు అప్పగించిన మిషన్‌ రిజల్ట్‌ తెలుసుకునే రోజును ఫిక్స్‌ చేసుకున్నారు. డిసెంబర్‌ 21న వరుణ్, సంకల్ప్‌ రెడ్డి తమ స్పేస్‌ జర్నీలోకి ఆడియన్స్‌ను తీసుకువెళ్లనున్నారు. ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ఓ స్పేస్‌ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్‌ తెలుగు స్పేస్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సాయిబాబు, వై. రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, అదితీ రావ్‌ హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ 21న రిలీజ్‌ చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ‘‘తొలి తెలుగు స్పేస్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్‌ కంప్లీట్‌ చేశాం. ఈ రెండు షెడ్యూల్స్‌లో హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌ నేతృత్వంలో డూప్‌ లేకుండా వరుణ్‌ తేజ్‌ కొన్ని ఫైట్స్‌ చేశారు. త్వరలో టైటిల్, ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసి, డిసెంబర్‌ 21న సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు ‘అంతరిక్షం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి.

మరిన్ని వార్తలు