నేను నోరు విప్పితే బాగోదు: రేణూ దేశాయ్‌

29 Jun, 2018 11:07 IST|Sakshi

నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ మరోమారు పవన్‌ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో వివాహం నేపథ్యంలో ఆమెను ఉద్దేశిస్తూ పలువురు పవన్‌ ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేయటంపై ఆమె మండిపడ్డారు. విడాకుల వ్యవహారంపై ఇన్నాళ్లు తాను మౌనంగా ఉన్నానని, అలా ఉన్నందుకు పవన్ అభిమానులు కృతజ్ఞతగా ఉండాలని ఆమె సూచించారు. మర్యాదగా ప్రవర్తించాలని, అలా కాకుండా విడాకుల వ్యవహారంపై తాను నోరు విప్పితే అభిమానుల పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుందని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వరుస స్టోరీలు పోస్టు చేశారు.

‘విడాకుల వెనక ఉన్న వాస్తవాలను చెబితే అవివేకులైన ఫ్యాన్స్‌కు గర్వభంగం అవుతుంది’ అంటూ తీవ్రస్థాయిలో ఆమె వ్యాఖ్యానించారు. ‘పవన్ అభిమానుల్లో చాలా మంది మర్యాదస్తులు, మంచివాళ్లు ఉన్నప్పటికీ, కొందరు(ఓ 10 శాతం) మాత్రం అవివేకులే. నెగిటివిటీని భరించాల్సిన అవసరం నాకు లేదు. అసలు నేనేం చేశానని వాటిని భరించాలి?’ అని రేణూ ప్రశ్నించారు. దయచేసి సలహాలు ఇవ్వడం మానుకోవాలని.. ఇక నుంచైనా తనను టార్గెట్‌ చేయకపోవటమే మంచిందని ఆమె హెచ్చరించారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తనతో ఏడుపుగొట్టు కథలు చెప్పుకోవడం మానుకుంటే మంచిదన్నారు.  అభిమానుల మూర్ఖత్వానికి తెరపడి, తన గురించి, తన పని గురించి వచ్చే కామెంట్లను స్వేచ్ఛగా చదువుకునే రోజు రావాలని ప్రార్థిస్తున్నట్టు రేణు దేశాయ్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు