అమ్మ మరణంతో మరోసారి రీ షూట్

13 Dec, 2016 13:03 IST|Sakshi
అమ్మ మరణంతో మరోసారి రీ షూట్

కన్నడ నటి రాగిణీ ద్వివేది ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం అమ్మ. ఈ సినిమా జయలలిత జీవితకథ ఆదారంగా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని అంగీకరించకపోయినా.. లీడ్ యాక్ట్రస్ రాగిణీ మాత్రం ఇది అమ్మ జీవిత చరిత్రే.. తను అమ్మ పాత్రలోనే నటిస్తున్నానంటూ ప్రచారం చేసుకుంటోంది.

కన్నడ వివాదాస్పద దర్శకుడు ఫైసల్ సైఫ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జయ మరణం తరువాత రీ షూట్ చేసేందుకు రెడీ అవుతున్నారట. గతంలోనూ జయ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సమయంలో అమ్మ సినిమాను రీషూట్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆమె మరణం తరువాత రీషూట్కు వెళుతుండటంతో ఇది నిజంగానే జయలలిత బయోపిక్ అన్న వాదనకు బలం చేకూరుతోంది.

తన్వీ ఫిలింస్ బ్యానర్పై సీఆర్ మనోహర్ నిర్మిస్తున్న ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళ్, మళయాల, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాండల్వుడ్లో హాట్ ఇమేజ్ ఉన్న రాగిణీ.., అమ్మ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా మరిన్ని వివాదాలకు తెర తీసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.