మళ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ!

16 May, 2019 12:18 IST|Sakshi

మేము మళ్లీ పోటీ చేయడానికి రెడీ అని తెలిపారు ప్రస్తుతం దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్‌సంఘం) కార్యవర్గం. ఈ సంఘానికి మూడేళ్లకొకసారి ఎన్నికలు జరగడం ఆనవాయితీ. గత 2015లో జరిగిన ఎన్నికల్లో నటుడు శరత్‌కుమార్, రాధారవి జట్టుపై, నటుడు నాజర్, విశాల్, కార్తీల జట్టు పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ కార్యవర్గం పదవీ కాలం గత ఏడాది అక్టోబరుతోనే ముగిసింది. అయితే సంఘ నూతన భవన నిర్మాణం పూర్తి అయ్యే దశలో ఉండడంతో ఎన్నికలను 6 నెలల పాటు వాయిదా వేశారు. అయితే ఇలా వాయిదా వేయడంపై వ్యతిరేక వర్గం తీవ్రంగా ఆరోపిస్తోంది.

ఇప్పటికే ఒకసారి అత్యవసరం సమావేశం నిర్వహించిన ప్రస్తుత కార్యవర్గం తాజాగా మంగళవారం సాయంత్రం మరోసారి స్థానిక టీనగర్‌లోని ఓ హోటల్‌లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసే విషయం, పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. సమావేశ అనంతరం సంఘం అధ్యక్షుడు నాజర్‌ మీడియాతో మాట్లాడుతూ తమ జట్టు మళ్లీ పోటీ చేస్తుందని వెల్లడించారు.

కాగా ఈ ఎన్నికలను మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి పద్మనాభన్‌ పర్యవేక్షణలో జరగనున్నట్లు తెలిపారు. సంఘం ఎన్నికలు ఎప్పుడు? ఎక్కడ నిర్వహించాలనన్నది పద్మనాభన్‌ నిర్ణయం తీసుకుంటారని నాజర్‌ తెలిపారు.  ఈ సమావేశంలో నడిగర్‌ సంఘ కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షుడు పొన్‌వన్నన్, పూచీ.మురుగన్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు