పైపుల రోడ్డుకు వస్తానన్నా.. వచ్చా : ఆర్జీవీ

28 May, 2019 14:28 IST|Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అన్నంత పనీ చేశాడు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్ రిలీజ్‌కు ఆంధ్ర ప్రదేశ్‌లో అడ్డంకులు ఎదురుకావటంతో విజయవాడలోని పైపులరోడ్డులో ప్రెస్‌మీట్ పెట్టేందుకు వర్మ ప్రయత్నించాడు. కానీ పోలీసులు అడ్డుకొని వర్మను అరెస్ట్ చేశారు. తాజాగా ఎన్నికల ఫలితాల తరువాత కూడా పైపుల రోడ్డులో ప్రెస్‌మీట్ పెట్టేందుకు ప్రయత్నించిన వర్మ, ఎండ తీవ్రత కారణంగా ఫిలిం చాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

అయితే మంగళవారం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా వర్మ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రాహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వర్మతో పాటు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి కూడా ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిని వర్మ ఎన్టీఆర్‌ ఆశీస్సులతో తన పంతం నెగ్గిందన్నారు.

వర్మ, అగస్త్య మంజులు సంయుక్తంగా డైరెక్ట్‌ చేసిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మే 31న ఆంధ్ర ప్రదేశ్‌లో విడుదల కానుంది.

మరిన్ని వార్తలు