‘ఎందుకు.. ఎందుకు.. లక్ష్మీ పార్వతి ఎందుకు..’

8 Jan, 2019 19:02 IST|Sakshi

ఓ వైపు నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ.. నటించిన యన్‌.టీ.ఆర్‌ కథానాయకుడు విడుదలకు సిద్దమవుతుండగా.. రామ్‌గోపాల్‌ వర్మ తన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’తో సంచలనం రేపుతున్నారు. వెన్నుపోటు సాంగ్‌ అంటూ రిలీజ్‌ చేసిన మొదటి సాంగ్‌ ఎన్నో వివాదాలకు ఆజ్యంపోసింది. చివరకి కేసులు పెట్టుకునేదాక పోయింది. అయితే వెనుకడుగు వేస్తే.. ఆర్జీవీ ఎలా అనిపించుకుంటారు. మళ్లీ తన చిత్రంలోని రెండో సాంగ్‌ను రిలీజ్‌ చేసేశారు. 

అంతేనా.. ఈ పాట చివర్లో తన గాత్రంతో ఉన్న సంభాషణలు వింటే కొందరికి వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ‘అబద్దాలుగా చెలామణి అవుతున్న నిజాలను.. నిజాలుగా మసిపూసుకున్న అబద్దాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయడమే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ధ్యేయం. ఇరవై సంవత్సరాలకి పైగా నిజానికి అబద్దమనే బట్టలు తొడిగి.. వీధులెంట తిప్పుతున్న వెన్నుపోటు దారుల అందరి బట్టల్ని ప్రజల కళ్ల ముందు చింపి అవతలపారేసి.. నిజం బట్టల్ని  ఒక్కొక్కటిగా మెల్లిగా విప్పి .. దాన్ని మళ్లీ పూర్తి నగ్నంగా చూపించడమే.. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఉద్దేశం’ అంటూ వర్మ తన స్టైల్లో చెప్పాడు. 

ఎందుకు ఎందుకు అంటూ జయసుధ, జయప్రధ, శ్రీదేవి ఉండగా.. లక్ష్మీ పార్వతి ఎందుకు అంటూ.. సీబీఎన్‌, ఎన్‌బీకే, దగ్గుబాటి ఉండగా.. లక్ష్మీ పార్వతి ఎందుకు అంటూ ఎన్నో కోణాల్లోంచి ప్రశ్నలను సంధించారు. సిరాశ్రీ ఈ పాటను రాయగా.. కళ్యాణీ మాలిక్‌, శ్రీ కృష్ణ ఆలపించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు