‘నా ఆరోగ్యంపై ఊహాగానాలు వద్దు’

30 Sep, 2018 16:05 IST|Sakshi
బాలీవుడ్‌ సినీదిగ్గజం రిషీ కపూర్‌ (ఫైల్‌ఫోటో)

ముంబై : అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం అమెరికా వెళుతున్నట్టు  బాలీవుడ్‌ నటుడు  రిషీ కపూర్‌ తన అభిమానులు, మిత్రులకు సమాచారం అందించారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్‌ చేశారు. వైద్య చికిత్స నిమిత్తం అమెరికాకు వెళుతూ పనికి కొద్దిరోజులు విరామం ఇస్తున్నానని, తన ఆరోగ్యంపై అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని, ఎలాంటి వదంతులూ ప్రచారం చేయవద్దని కోరారు.

అభిమానుల ప్రేమ, ఆశీస్సులతో 45 సంవత్సరాల పాటు తన సినీప్రయాణం సాగిందని, మీ అందరి దీవెనలతో తాను త్వరలోనే తిరిగివస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు. తమ కుటుంబానికి చెందిన ఆర్‌కే స్టూడియోస్‌లో ఇటీవల జరిగిన గణేష్‌ నిమజ్జన వేడుకల్లో రిషీకపూర్‌ తన కుమారుడు, సోదరులతో కలిసి కనిపించారు. గత ఏడాది ఆర్‌కే స్టూడియోస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడం కలకలం రేపింది. పునురుద్ధరణ భారీ వ్యయప్రయాసలతో కూడినది కావడంతో సుప్రసిద్ధ ఆర్‌కే స్టూడియోస్‌ను కపూర్‌ కుటుంబ సభ్యులు అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు