త్వరలోనే ఇండియాకు వచ్చేస్తా : నటుడు

17 Jul, 2019 20:39 IST|Sakshi

న్యూయార్క్‌ : ట్రీట్‌మెంట్‌లో భాగంగా తాను భారీగా బరువు తగ్గినట్లు బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ తెలిపాడు. గతేడాది క్యాన్సర్‌ బారిన పడిన రిషి కపూర్‌ ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ..‘ తొమ్మిది నెలల క్రితం ఢిల్లీలో షూటింగ్‌ చేస్తున్నపుడు జట్టుకు రంగు వేసుకుంటున్న సమయంలో అస్వస్థతకు గురయ్యాను. దీంతో మూవీ యూనిట్‌ అప్పటికప్పుడు నన్ను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. క్యాన్సర్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రాథమిక చికిత్స అనంతరం న్యూయార్క్‌ వచ్చాను. ట్రీట్‌మెంట్‌లో భాగంగా నాలుగు నెలలు దాదాపుగా పస్తులు ఉండాల్సి వచ్చింది. అలా 26 కిలోల బరువు తగ్గాను. ఇప్పుడు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. మళ్లీ 8 కిలోలు పెరిగాను. పూర్తిగా బక్కచిక్కి ఉండటం నాకు ఇష్టం ఉండదు. త్వరలోనే పూర్వపు  రూపానికి వస్తాను’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇక కష్టకాలంలో తన భార్య నీతూ కపూర్‌, పిల్లలు రణ్‌బీర్‌, రిధిమ తనకు అండగా నిలిచారని రిషి కపూర్‌ పేర్కొన్నాడు. తాను ఇంత త్వరగా కోలుకోవడానికి కారణం వాళ్లేనన్నాడు. అయితే ఇంటిని విడిచి ఇంతకాలం విదేశంలో ఉండటం తనకు బాధగా ఉందని, ఇండియాను మిస్సవుతున్నట్లు తెలిపాడు. ఆగస్టు నాటికి పూర్తి స్థాయిలో కోలుకుని ముంబైకి వచ్చేస్తానని పేర్కొన్నాడు. కాగా రిషి కపూర్‌ నటించిన జూతా కహీ కా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

మరిన్ని వార్తలు