ప్రియమైన మిత్రులారా.. శత్రువులారా...

5 Feb, 2020 03:01 IST|Sakshi
రిషీ కపూర్‌

‘‘మీరు నా పట్ల చూపించిన ప్రేమ, శ్రద్ధకు ధన్యవాదాలు.. నాకేం కాలేదు. బాగున్నాను’’ అంటూ సీనియర్‌ నటుడు రిషీ కపూర్‌ తన ట్వీటర్‌లో పేర్కొన్నారు. విషయం ఏంటంటే.. స్వల్ప అనారోగ్యంతో రిషి ఆస్పత్రిలో చేరారు. అంతే.. ఆయనకేదో అయిందంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ వార్తకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుకున్నారు రిషి. ‘‘ప్రియమైన మిత్రులారా.. శత్రువులారా.. ట్వీటర్‌లో నన్ను ఫాలో అవుతున్న అభిమానుల్లారా నా ఆరోగ్యం గురించి మీరు చూపించిన శ్రద్ధకు ధన్యవాదాలు.

18 రోజులుగా ఢిల్లీలో షూటింగ్‌ చేస్తున్నాను. పొల్యూషన్‌ వల్ల ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డాను. అందుకని ఆస్పత్రిలో చేరాను. అంతకు మించి వేరే ఏమీ లేదు. నేను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి, ముంబై వచ్చేశాను. చాలామంది అల్లిన కథలకు ముగింపు ఇస్తున్నాను. ముంబైలో హాయిగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు రిషీ కపూర్‌. ప్రస్తుతం ఆయన ‘షర్మాజీ నమ్‌కీన్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు