విజయ్‌సేతుపతితో మళ్లీ రొమాన్స్

24 Oct, 2016 01:29 IST|Sakshi
విజయ్‌సేతుపతితో మళ్లీ రొమాన్స్

 సక్సెస్‌ఫుల్ జంట విజయ్‌సేతుపతి, రితికాసింగ్ మరోసారి కలిసి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. స్టార్ హీరోలతో రొమాన్స్ చేసి ప్రముఖ హీరోయిన్లుగా ఎదిగిన వారి సంఖ్య చిత్రపరిశ్రమలో అధికం. తొలి చిత్రంతోనే కథనంతా తన భుజాన మోసి విజయం సాధించిన హీరోయిన్లు చాలా తక్కువ మందే. అలాంటి వారి సరసన చేరిన నటి రితికాసింగ్. రియల్ లైఫ్‌లో బాక్సింగ్ రాణి అయిన రితికా రీల్ లైఫ్‌లోకీ అదే పాత్రతో ఎంటర్ అయి ఇరుదు చుట్రు అంటూ ఏక కాలంలో తమిళం, హిందీ ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు.
 
 ఆ చిత్రంలో మాధవన్‌తో పోటీ పడి నటించిన రితికాసింగ్ తదుపరి కాక్కా ముట్టై చిత్రం ఫేమ్ మణికంఠన్ దర్శకత్వంలో విజయ్‌సేతుపతికి జంటగా ఆండవన్ కట్టళై చిత్రంలో నటించే అవకాశాన్ని పొంది దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇందులో పత్రికా విలేకరిగా వైవిధ్యమైన నటనతో పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఇలా వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్న రితికాకు తాజాగా మరో అవకాశం వచ్చింది. రేణిగుంట చిత్రం ఫేమ్ పన్నీర్‌సెల్వం దర్శకత్వం వహించనున్న తాజా చిత్రంలో విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు.
 
 ఆయనకు జంటగా ముందు నటి కీర్తీసురేశ్‌ను ఎంపిక చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. అయితే ఆమె కాల్‌షీట్స్ లేకపోవడంతో మరోనటి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. రెమో చిత్ర విజయంతో కీర్తీసురేశ్ అధిక పారితోషికం డిమాండ్ చేశారనే మరో టాక్ కోడంబాక్కం వర్గాల్లో వినిపిస్తోంది. ఏదేమైతేనేం కీర్తీసురేశ్ నటించాల్సిన పాత్ర నటి రితికాసింగ్‌ను వరించింది. దీంతో ఆండవన్ కట్టళై చిత్రం తరువాత విజయ్‌సేతుపతితో మరో సారి రొమాన్స్ చేయడానికి రితిక రెడీ అవుతున్నారన్నమాట.