శింబు, ఆండ్రియాల సాన్నిహిత్యం

8 Nov, 2013 04:18 IST|Sakshi
నటుడు శింబు, నటి ఆండ్రియా చాలా సన్నిహితంగా మెలుగుతున్నారని, ఇది మింగుడుపడని శింబు ప్రేయసి హన్సిక షాక్‌కు గురైందని తాజా సమాచారం. కోలీవుడ్‌లో సంచలన నటుడిగా పేరొందిన నటుడు శింబు నిజ జీవితంలో నటి నయనతారతో లవ్ డ్యూయెట్లు పాడారు. వీరి ప్రేమ పెళ్లిపీటలు ఎక్కకుండానే ముక్కలైంది. సమీప కాలంలో నటి హన్సిక, శింబు ప్రేమ లో పడ్డారు. వీరు వెట్టై మన్నన్, వాలు చిత్రాల్లో నటిస్తున్నప్పుడు ప్రేమకు బీజం పడింది. వీరి గురించి రకరకాల ప్రచారం జరగడంతో ఒక ఫైన్‌డే ‘మేము ప్రేమించుకుం టున్నాం. పెళ్లి కూడా చేసుకుంటాం’ అంటూ శింబు, హన్సిక బహిరంగంగా ప్రకటించారు. 
 
 వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శింబు ఇటీవల సొంతంగా ఒక అం దమైన భవనాన్ని కట్టించుకుని గృహ ప్రవేశం కూడా చేశాడు. ఇక హన్సికతో పెళ్లే తరువాయి అనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల తర్వాతే తమ పెళ్లి ఉంటుందని నటి హన్సిక స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీని వెనుక ఆమె తల్లి ఒత్తిడి ఉందన్నది అసలు విషయం. నటిగా హన్సిక కెరీర్ ప్రస్తుతం చాలా బ్రైట్‌గా ఉంది. చేతినిండా చిత్రాలున్నాయి. విజయాల బాటలో పయనిస్తోంది. పారితోషికం బాగా డిమాండ్ చేస్తోంది. దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే సామెతను హన్సిక తల్లి అమలుచేస్తోంది. పెళ్లి చేసుకుంటే నటనకు స్వస్తి చెప్పాలి. లక్షల ఆదాయానికి గండి పడుతుంది. 
 
 అలా జరగడం హన్సిక తల్లికి ఇష్టం లేదు. ఇది శింబుకు మింగుడు పడ లేదు. దీంతో వారి మధ్య దూరం పెరిగినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో హాస్యనటుడు వీటీవీ గణేష్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఇంగ ఎన్న సొల్లుదు చిత్రంలో శింబు అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఈయన సరసన సంచలన నటి ఆండ్రియా నటిస్తోంది. ఈమె ఆ మధ్య యువ సంగీత దర్శకుడు అనిరుద్‌తో ప్రేమ కలాపాలు సాగించింది. అది నెట్‌లో హల్‌చల్ చేయడంతో ముగిసిపోయిన ప్రేమ కథ అంటూ తేలిగ్గా కొట్టి పారేసింది. తాజా గా శింబుతో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. ఇంగ ఎన్న సొల్లుదు చిత్ర షూటింగ్ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు టాక్. ఈ టాక్ నటి హన్సికకు పెద్ద షాక్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.