ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

19 Nov, 2019 20:09 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా ఎవరు నటిస్తారనేది రేపు( నవంబర్‌ 20) రివీల్‌ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా ప్రతినాయక పాత్రల గురించి కూడా రేపే చెబుతామని వెల్లడించింది. సినిమా షూటింగ్ దాదాపుగా 70శాతం పూర్తిచేసినట్టుగా యూనిట్ పేర్కొంది. 

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పిరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమరం భీంగా నటిస్తున్నారు. రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుంది. 

ముందుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన  నటించేందుకు హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ ను ఎంపిక చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో డైసీ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోనుంది. దీంతో అప్పటి నుంచి ఎన్టీఆర్‌ సరసన ఎవరు నటిస్తారనే సందేహం అభిమానుల్లో మొదలైంది. అమెరికన్‌ నటి, గాయని ఎమ్మా రాబర్ట్స్‌ను ఎన్టీఆర్‌ సరసన నటిస్తారని పుకార్లు వచ్చాయి.. కానీ చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఎవరి పేరును ప్రకటించలేదు. ఎన్టీఆర్‌కు జోడీగా జక్కన్న ఎవరిని తీసుకొస్తారనేది రేపు తెలియనుంది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ఫై దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది  జూలై 30న ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు