ఆవేశం కాదు.. ఆలోచన ముఖ్యం

20 Nov, 2018 03:54 IST|Sakshi
సోనా పటేల్, శివ

శివ, సోనా పటేల్‌ జంటగా పైడి రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూల్‌’ (ది పవర్‌ ఆఫ్‌ పీపుల్‌). శ్రీ సుదర్శన చక్ర క్రియేషన్స్‌ పతాకంపై పైడి సూర్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పైడి రమేష్‌ మాట్లాడుతూ– ‘‘యువజన నాయకుడైన హీరో తన కుటుంబంతో పాటు ఎన్నో నిరుపేద కుటుంబాలకు అన్యాయం జరగకుండా ఎలా ఆదర్శవంతుడిగా నిలిచాడన్నది ఈ చిత్రకథాంశం. హైదరాబాద్, వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం.

మా సినిమా ద్వారా రమణ సాయిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఆవేశం కంటే ఆలోచనలు ముఖ్యం. మనీ కంటే మనుషుల విలువలు ముఖ్యం అని తెలియజేసే మెసేజ్‌ ఉన్న చిత్రం ‘రూల్‌’. సినిమా చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. తెలంగాణ ఎన్నికల సమయంలో మా చిత్రం విడుదల కావటం సంతోషంగా ఉంది’’ అన్నారు పైడి సూర్యనారాయణ. ‘‘కెమెరామెన్‌గా ఉన్న నన్ను ఈ సినిమాతో హీరోని చేశారు డైరెక్టర్‌’’ అని శివ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాలా, సహ నిర్మాత: పాంగ కోదండరావు.

మరిన్ని వార్తలు