‘‘నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్లో. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. వైజాగ్లో సత్యానంద్గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నా. అవకాశాల కోసం చాలా ఆడిషన్స్కి వెళ్లా. కానీ, సమయం కలిసి రాలేదు. నేను, శివ కలిసి ఓ వెబ్ సిరీస్ చేశాం. అది చాలా బాగా రావడంతో సినిమా చేయొచ్చనే నమ్మకం కలిగి, ‘22’ సినిమా మొదలు పెట్టాం’’ అని రూపేష్ కుమార్ చౌదరి అన్నారు. దర్శకులు వీవీ వినాయక్, పూరి జగన్నాథ్, మారుతిల వద్ద పనిచేసిన శివకుమార్ బి. దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘22’.
రూపేష్ కుమార్ చౌదరి హీరోగా, ‘ఫలక్నుమా దాస్’ ఫేమ్ సలోని మిశ్రా హీరోయిన్గా సుశీలా దేవి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. నేడు (శుక్రవారం) తన పుట్టినరోజుని పురస్కరించుకుని రూపేష్ కుమార్ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘22’ నంబర్పై ఈ చిత్రకథ నడుస్తూ ఉంటుంది. చాలా ట్విస్ట్లు ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్లో చేజింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. నాకు పోలీస్ పాత్ర అంటే ఇష్టం.. పోలీసులంటే గౌరవం. నా తొలిసినిమాకే నాకిష్టమైన పోలీస్ పాత్ర చేసే అవకాశం రావడం అదృష్టం.
‘టెంపర్’లో ఎన్టీఆర్గారు పోలీస్ పాత్రలో ప్రాణం పెట్టి చేశారు. ‘గబ్బర్సింగ్’ సినిమా కూడా చాలా బాగుంటుంది. శివగారి దర్శకత్వం బాగుంది కాబట్టే ‘22’ సినిమా చేస్తున్నాం.. లేకుంటే వెబ్ సిరీస్తోనే ఆపేసేవాళ్లం. సినిమా కోసం బాగా కష్టపెడుతున్నాడు(నవ్వుతూ). సీఐ పాత్రకి మంచి ఫిజిక్ కోసం జిమ్లో వర్కవుట్స్తో పాటు, డైట్ ఫాలో అయ్యేలా చేస్తున్నాడు. ఆ కష్టం సినిమాకి అవసరం అనిపిస్తోంది. యాని మాస్టర్ నాకు గాడ్ఫాదర్లాంటివారు. ఆమె వల్లే ఈ అవకాశాలు వచ్చాయి. లీడ్రోల్స్ మాత్రమే చేయాలి, హీరో అవ్వాలనుకోలేదు.. మంచి నటుడు అనిపించుకుంటే చాలు. రొమాంటిక్ సన్నివేశాలు చేయడం నాకు అసౌకర్యంగా అనిపిస్తాయి. అయితే కథ డిమాండ్ చేస్తే చేస్తా’’ అన్నారు.