‘హిప్పీ’ షూటింగ్ మొదలైంది..!

9 Nov, 2018 14:05 IST|Sakshi

Rx 100 చిత్రంతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకొన్న కార్తికేయ , దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను, దర్శకుడు టీఎన్ కృష్ణ కాంబినేషన్  లో  వస్తున్న చిత్రం హిప్పీ. వీ క్రియేషన్స్ పతాకం పై  రూపొందిస్తున్న హిప్పీ చిత్ర షూటింగ్  శుక్రవారం హైదరాబాద్‌లోని  రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాత కలైపులి థాను క్లాప్ ఇచ్చారు .

ఈ సందర్భంగా హీరో  కార్తికేయ   మాట్లాడుతూ.. ‘RX 100 సినిమా తర్వాత చాలా స్క్రిప్టులు విన్నాను. ఆ తర్వాత ఎలాంటి కథతో సినిమా చేయాలనే విషయంపై క్లారిటీ లేకపోయింది. ఆర్ఎక్స్ 100 చిత్రానికి భిన్నంగా ఉండే సినిమా, క్యారెక్టర్ చేయాలని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు టీఎన్ కృష్ణ ఈ సినిమా కథ చెప్పారు. కథ విన్న తర్వాత బాగా నచ్చడంతో వెంటనే ఓకే  చెప్పాను. ఆ తర్వాత నిర్మాత కలైపులి థాను ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలిసింది. దాంతో మరింత ఉత్సాహం కలిగింది. కలైపులి థాను దక్షిణాదిలో ఎంత పెద్ద నిర్మాతో అందరికీ  తెలుసు. కబాలి లాంటి పెద్ద పెద్ద సినిమాలు  తీసిన  నిర్మాత, బ్యానర్‌లో నటించడం,  అలాంటి ప్రొడ్యూసర్‌తో నా కెరీర్ ఆరంభంలో రెండో సినిమా చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నా కెరీర్ని టాప్  లెవెల్‌కు తీసుకెళ్తుందని బలంగా నమ్ముతున్నాను’ అన్నారు. 

దర్శకుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ.. ‘దర్శకుడిగా  నాకు తెలుగులో తొలి స్ట్రయిట్ చిత్రం హిప్పీ. హిప్పీ అంటే కేర్ ఫ్రీ. కథ కూడా అలాగే ఉంటుంది. హీరో  కార్తికేయ నటించిన ఆర్ ఎక్స్ 100 మూవీ చూశాను. నాకు బాగా నచ్చింది.  కార్తికేయ బాడీలాంగ్వేజ్‌కు చక్కగా సరిపోయే చిత్రం ఇది. ఆర్ఎక్స్ 100 లాంటి పెద్ద హిట్ తర్వాత కార్తికేయ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయనతో సినిమా చేయడం చాలెంజ్‌గా అనిపిస్తున్నది. వెరీ ఇంట్రస్టింగ్ ఎంటర్టైనర్ ఇది . తమిళంలో మంచి క్రేజ్ ఉన్న సంగీత దర్శకుడు నివాస్ ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది’ అని అన్నారు. 

నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ.. ‘హిప్పీ సినిమా కథ తెలుగు వారందరికీ నచ్చుతుంది. ఆర్‌ఎక్స్ 100 సినిమా చూసిన తర్వాత  కార్తికేయ ఈ సినిమాకు యాప్ట్ అనిపించింది.  కార్తికేయ  కథ వినగానే ఓకే అన్నారు. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత శ్రీలంకలో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు