ఎంత కష్టం వచ్చిందో

11 Sep, 2018 00:23 IST|Sakshi
శ్రద్ధా కపూర్‌

ఒక్క సినిమా. కష్టమేమో రెండు సినిమాలంత అట. ఒక భాషలో చేసిన వెంటనే ఇంకో భాషలో యాక్ట్‌ చేయాలి. దానికోసం రెండు భాషల్లో డైలాగ్స్‌ గుర్తు పెట్టుకోవాలి. ప్రస్తుతం శ్రద్ధా కపూర్‌ ఇదే చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏదంటే ‘సాహో’. సుజిత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్‌ ఇందులో కథానాయిక. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌ నిర్మాతలు.

ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ భారీ చిత్రం షూటింగ్‌ కోసం రెండు సినిమాల కష్టం పడాల్సిందే అంటున్నారు శ్రద్ధా. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘సాహో అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్‌. పెద్ద సెట్స్, లొకేషన్స్‌ చేంజ్‌లు ఉన్నాయి. అలాగే ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం కావడంతో ప్రతీ సీన్‌ రెండు సార్లు యాక్ట్‌ చేయాలి. ఒకసారి తెలుగులో యాక్ట్‌ చేస్తాం. అది బాగా వస్తే మళ్లీ అదే సీన్‌ని హిందీలో చేయాలి. అలా కాకపోతే మరోలా.

ఈ సినిమా కోసం నా లైన్స్‌ నేనే గుర్తు పెట్టుకుంటున్నా. కొత్త భాషలో డైలాగ్స్‌ గుర్తు పెట్టుకోవడం చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్‌లా ఉంది. చాలా టైమ్‌ కూడా పడుతుంది. పేరుకి ఒక్క సినిమా అయినా కష్టం రెండు సినిమాలది. అయినా ఎంత కష్టపడ్డా రిజల్ట్‌ ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది’’ అని పేర్కొన్నారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవెలిన్‌ శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు