సాక్ష్యం షోలు రద్దు!

27 Jul, 2018 10:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారీ బడ్జెట్‌తో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సాక్ష్యం. శ్రీవాస్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు(జూలై 27)న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే ఎర్లి మార్నింగ్‌ షోతోపాటు మార్నింగ్‌ షోలు కూడా దాదాపు రద్దయ్యాయి. ఇందుకు టెక్నికల్‌ ఇష్య్సూ కారణమని చెబుతున్నప్పటికీ..  మరోవైపు న్యాయపరమైన సమస్యలనే టాక్‌ వినిపిస్తోంది. ‌నిర్మాత అభిషేక్ నామా, ఫైనాన్షియర్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగానే షోలు ఆగినట్లు సమాచారం. చిత్ర విడుదలను నిలిపివేయాలని నిర్మాతకు లీగల్ నోటీసులు కూడా అందినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఉదయం షోలు రద్దయ్యాయంట. 

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఇప్పటి వరకు ఈ చిత్రం షోలు పడలేదు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో పడాల్సిన 8.45 గంటల షో కూడా రద్దయింది. ఏపీ, తెలంగాణల్లో మార్నింగ్ షోలు కూడా ఉండవని పలువురు సినీ జర్నలిస్టులు ట్వీట్లు చేశారు. మధ్యాహ్నానికి ఈ సమస్యలన్నీ పరిష్కరించకుని మ్యాట్నీ షో నుంచి చిత్ర ప్రదర్శనను ప్రారంభించాలని నిర్మాత యత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్‌కు డిజిటల్ ప్రింట్ అందలేదు. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల సమయంలో చిక్కులు ఎదుర్కొవటం గమనార్హం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు విలన్‌. యాక్షన్‌ ఫాంటసీ థ్రిల్లర్‌గా సాక్ష్యం తెరకెక్కింది.

మరిన్ని వార్తలు