శ్రుతి డైరెక్షన్ చేయడం సరికొత్త అనుభవం

9 Jul, 2016 02:39 IST|Sakshi
శ్రుతి డైరెక్షన్ చేయడం సరికొత్త అనుభవం

శ్రుతిహాసన్‌ను డైరెక్ట్ చేయడం సరికొత్త అనుభంగా పేర్కొన్నారు ఆమె తండ్రి, ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత కమలహాసన్. ఈ విశ్వనటుడు తాజగా శభాష్‌నాయుడు చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్ తొలిసారిగా ఆయనతో కలిసి నటిస్తున్నారన్న విషయం తెలిసిందే.మలయాళ దర్శకుడు రాజీవ్‌కమార్ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఆయన అనూహ్యంగా షూటింగ్ ఆరంభంలోనే అనారోగ్యానికి గురికావడంతో దర్శకత్వం బాధ్యతలను కమలహాసన్ తన భుజాలపై మోయాల్సిన పరిస్థితి.

శభాష్‌నాయుడు చిత్రం షూటింగ్ అమెరికాలో శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన కూతురు శ్రుతిని డెరైక్షన్ చేయడం సరికొత్త అనుభవం అని కమల్ పేర్కొన్నారు.ఇంతకు ముందు పలువురు నటీనటులను డెరైక్షన్ చేసినా శ్రుతి లాంటి స్టార్ హీరోయిన్‌ను తొలిసారిగా డెరైక్షన్ చేస్తున్నానని అన్నారు. తాను దశావతారం చిత్రంలో అమెరికా వ్యక్తి పాత్రకు మాట్లాడిన అమెరికా యాస ఉచ్చరింపునకు కారణం శ్రుతినేనన్నారు. తను అప్పట్లో అమెరికా నుంచి తిరిగొచ్చారన్నారు. శ్రుతినే తనకు అమెరికా యాసలో మాట్లాడడం నేర్పించినట్లు తెలిపారు.

ఇక తాను హాస్యానికి ఎప్పుడూ దూరం కాలేదన్నారు. దశాతారం చిత్రంలోనూ వినోదాన్ని జోడించానని అన్నారు. ఇక శభాష్‌నాయుడు ఆ చిత్రంలోని బలరామ్ నాయుడు పాత్రకు కొనసాగింపుగా భావించవచ్చునన్నారు. ఇది పూర్తి వినోదాత్మక కథా చిత్రం అని తెలిపారు. అమెరికా షెడ్యూల్ పూర్తి చేసి మిగిలిన భాగాన్ని చెన్నైలో చిత్రీకరించి చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు కమల్ వెల్లడించారు.