సెకండ్‌ గేరులోకి...

25 Jul, 2017 23:24 IST|Sakshi
సెకండ్‌ గేరులోకి...

ఫస్ట్‌ గేరులో బండి, బస్సు, కారు... ఏవైనా నెమ్మదిగా వెళతాయి. సెకండ్‌ గేరులో స్పీడ్‌ పెరుగుతుంది. ఇప్పుడు ప్రభాస్‌ అండ్‌ కో కూడా సెకండ్‌ గేరులోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ‘సాహో’ బండి (సిన్మా)ని సెకండ్‌ గేరు (షెడ్యూల్‌)లోకి తీసుకెళ్లి చిత్రీకరణ స్పీడ్‌ పెంచాలనే ఉద్దేశంలో ఉన్నారు.

ప్రభాస్‌ హీరోగా ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై ప్రమోద్, వంశీలు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. హైదరాబాద్‌లో ఓ పది రోజుల పాటు ఫస్ట్‌ షెడ్యూల్‌ జరిగింది. హీరో ప్రభాస్, విలన్‌ నీల్‌ నితిన్‌ ముఖేశ్, ఇతర ముఖ్య తారలపై కొన్ని సీన్స్‌ తీశారు. మరో వారంలో సెకండ్‌ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్‌ వేస్తున్నారు. ప్రస్తుతం సెట్‌ వర్క్‌ స్పీడుగా జరుగుతోంది. చిత్రీకరణ సంగతి పక్కన పెడితే... ఇందులో హీరోయిన్‌ ఎవరనేది ప్రకటించలేదు.