‘అజ్ఞాతవాసి’లోకి అన్నయ్య.. తేజు కొత్త ప్రొఫైల్‌ పిక్‌!

9 Jan, 2018 18:38 IST|Sakshi

హైదరాబాద్‌: త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ’అజ్ఞాతవాసి’ బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘అజ్ఞాతవాసి’ ఫీవర్‌ అభిమానుల్ని ఊపేస్తోంది. అభిమానులు ఇదే అంశంపై పోటాపోటీగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టర్‌లో పవన్‌ కల్యాణ్‌తోపాటు చిరంజీవి కూడా దర్శనమివ్వడం గమనార్హం. అయితే, ఇది ఒరిజినల్‌ పోస్టర్‌ కాదని తెలుస్తోంది. ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమాలోని చిరు పోజును.. అజ్ఞాతవాసి పోస్టర్‌లో అభిమానులే ఫొటోషాప్‌ చేసి ఉంటారని భావిస్తున్నారు.

ఈ పోస్టర్‌ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు అభిమానులు ఈ పోస్టర్‌ను ట్విట్టర్‌లో పంచుకోగా.. తాజాగా మెగాహీరో, చిరంజీవి, పవన్‌ మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కూడా ఈ ఫొటోను షేర్‌ చేసుకున్నారు. న్యూప్రొఫైల్‌ పిక్‌ అంటూ ఈ పోస్టర్‌ను తేజు ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు