అభిలాషకి జరిగినట్లుగానే తేజ్‌కి జరిగింది – సాయిధరమ్‌ తేజ్‌

27 Jun, 2018 00:13 IST|Sakshi

‘‘ఈ సినిమా టోటల్‌ క్రెడిట్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌కే చెందుతుంది. ఎందుకంటే నాకు తేజ్‌ డేట్స్‌ ఇచ్చిన ఏడాదిన్నర వరకు మంచి కథలు దొరకలేదు. ఓ రోజు ఫోన్‌ చేసి ‘నేను ఒక కథ విన్నాను. నాకు నచ్చింది,  మీకు న చ్చితే ఆ సినిమా చేద్దాం’ అని తేజ్‌ అన్నారు. కరుణాకరన్‌ వచ్చి కథ చెప్పారు. నాకు నచ్చటంతో సినిమా స్టార్ట్‌ అయ్యింది. యూత్‌ను ఆకట్టుకునే సినిమా ఇది. నా బ్యానర్లో ఎన్నో íß ట్‌ సినిమాలు నిర్మించాను. వాటికి ఏ మాత్రం తగ్గకుండా మా బ్యానర్‌లో వన్నాఫ్‌ ది బెస్ట్‌ మూవీస్‌ అవుతుంది’’ అన్నారు కేయస్‌ రామారావు. సాయిధరమ్‌ తేజ్‌ , అనుపమా పరమేశ్వరన్‌ జంటగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కేయస్‌ రామారావు నిర్మించిన చిత్రం ‘తేజ్‌’.

 ‘ఐ లవ్‌ యూ’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా జూలై 6న విడుదల కానుంది. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. పలువురు సినీ పి.ఆర్‌.ఓ (పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్స్‌)ల సమక్షంలో సాయిధరమ్, ఇంద్ర ఫిలింస్‌ డిస్ట్రిబ్యూటర్‌ దిలీప్‌ టాండన్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం సాయిధరమ్‌ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారు నటించిన ‘అభిలాష’ సినిమా పబ్లిసిటీ పి.ఆర్‌.ఓలు, జర్నలిస్టులతో ప్రారంభమైందని విన్నాను. నేను నటించిన ‘తేజ్‌’ సినిమా ట్రైలర్‌కూడా పి.ఆర్‌.ఓల సమక్షంలో జరగటం ఆనందంగా ఉంది. కరుణాకరన్‌గారు మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చారు. కేయస్‌ రామారావుగారికి కథ నచ్చాకే సినిమాను స్టార్ట్‌ చేశాం. మంచి సినిమా తీశాం. గోపీసుందర్‌ సంగీతం, ‘డార్లింగ్‌’ స్వామి మాటలు, ఆండ్రూ కెమెరా పనితనం, సాహీ సురేశ్‌ ఆర్ట్‌ డైరెక్షన్‌ సినిమాకు ఎస్సెట్స్‌గా నిలుస్తాయి. ప్రతి ఒక్కరికి సినిమా ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. సినిమాలో లవ్‌ ఫీల్‌ ఉంది. కరుణాకరన్‌గారికి మంచి హిట్, కేయస్‌ రామారావు గారికి బాగా డబ్బు రావాలి’’ అని మాటల రచయిత ‘డార్లింగ్‌’ స్వామి అన్నారు. 

మరిన్ని వార్తలు