ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. నటి ఆవేదన

3 Jul, 2020 14:09 IST|Sakshi

ఓ వైపు తూత్తుకుడి జిల్లాలో తండ్రి కోడుకుల జయరాజ్‌, బెనిక్స్‌ కస్టోడియల్‌ మరణాల పట్ల నిరసనలు కొనసాగుతుండగానే తమిళనాడులోని పుదుకొట్టాయ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై మృగాళ్లు పైశాచికంగా దాడి చేసి చంపేసిన ఘటన పట్ల ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రెండు రోజుల క్రితం తప్పిపోయిన బాలిక అత్యాచారానికి గురయ్యి దారుణంగా హత్యగావింపడింది. ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా సెలబ్రెటీలు, నెటిజనులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో నటి సాయి పల్లవి కూడా ఉన్నారు. (అనూహ్య మృతి; 70 లక్షల పరిహారం)

‘బలహీనులకు సాయం చేయడానికి ఇచ్చిన శక్తిని మేము దుర్వినియోగం చేస్తూ బలహీనులను బాధపెడతాము. మా రాక్షసానందం కోసం చిన్నారులను బలి తీసుకుంటాము. ఈ ఘటనలతో మానవజాతిపై ఆశ అత్యంత వేగంగా దిగజారుతోంది. గడుస్తున్న ప్రతి రోజు ప్రకృతి మనకో విషయం చెప్తుంది. మన జాతి శుభ్రంగా తుడిచి పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తు చేస్తోంది. ఈ అన్యాయాలు చూడటానికే మనం ఇంత దారుణమైన జీవితాన్ని గడుపుతున్నాం. పనికిరాని జీవితం. చిన్నారులను కాపాడలేకపోతున్నాం.. కనుక మరో బిడ్డను ఈ రాక్షసలోకంలోకి తీసుకు వచ్చే అర్హత కోల్పోయాం. ఓ దారుణం గురించి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయినప్పుడు లేదా మీడియాలో ప్రచారం జరిగినప్పుడు మాత్రమే న్యాయం జరిగే రోజు రాకూడదని కోరుకుంటున్నాను. మరి మనం గమనించని, పట్టించుకోని నేరాల విషయంలో ఏం చేద్దాం’ అంటూ సాయి పల్లవి వరుస ట్వీట్లు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
 

తమిళనాడు పుదుకొట్టాయ్ జిల్లా ఎంబాల్ గ్రామంకి చెందిన‌ ఏడేళ్ల జయప్రియ రెండో తరగతి చదువుతుంది. జూలై ఒకటో తేదీ అంటే బుధవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. రాత్రి అయినా తిరిగిరాలేదు. అర్థరాత్రి సమయంలో తల్లిదండ్రులు బంధువులు, చుట్టాలు, జయప్రియ స్నేహితుల ఇంటికి వెళ్లి ఆరా తీశారు. కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఈ క్రమంలో గ్రామం చివర.. ముళ్ల పొదళ్లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. పోస్ట్‌మార్టంలో చిన్నారిని అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు నిర్థారణ అయ్యింది. దాంతో త‌మిళనాట ఆగ్ర‌హ‌జ్వాల‌లు మొద‌ల‌య్యాయి. #JusticeForJayapriya అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్ట‌ర్‌లో హోరెత్తిస్తూ ఆమెకి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు 

మరిన్ని వార్తలు