అప్పుడు ప్రపంచాన్నే మర్చిపోతా..!

13 Oct, 2019 08:02 IST|Sakshi

చెన్నై : అప్పుడు ప్రపంచాన్నే మరిచిపోతానంటోంది నటి సాయిపల్లవి. ఇంతకీ ఈ అమ్మడు చెప్పొచ్చేదేమిటీ? చూసేస్తే పోలా.. నటిగా మాతృభాషలో గెలిచింది. తెలుగు చిత్రసీమలోనూ విజయాలను సొంతం చేసుకుంది. ఎటొచ్చీ తమిళ సినిమాలోనే సక్సెస్‌కు దూరం అయిపోయిందీ భామ. ఆ మధ్య సూర్య సరసన నటించిన ఎన్‌జీకే చిత్రం చాలా ఆశలు పెట్టుకున్నా, అది తీవ్ర నిరాశనే మిగిల్చింది. దానికి ముందు ధనుష్‌తో జతకట్టిన మారి–2 చిత్రమే బెటర్‌ అనిపించింది. అందులో ఒక పాట యూట్యూబ్‌ ప్రేక్షకులను విశేషంగా అలరించి రికార్డు స్థాయిలో నిలిచింది. ఇకపోతే తమిళంలో సాయిపల్లవికి ప్రస్తుతం ఒక్క అవకాశం లేదు. ఇక్కడ అవకాశాలు, విజయాలు అందకపోవడానికి తనకున్న పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ ఒక కారణం కావచ్చు. అయితే తెలుగులో అలాంటి ఇమేజ్‌తోనే అవకాశాలను రాబట్టుకుంటున్న సాయిపల్లవి అక్కడ మాత్రం రెండు చిత్రాల్లో నటిస్తోంది. మాతృభాషలో మంచి పేరే ఉంది.

కాగా ఇటీవల ఈ అమ్మడు ఒక ఇంటర్య్వూలో పేర్కొంటూ తన నటన చాలా సహజంగా ఉంటుందని పలువురు ప్రశంచిస్తున్నారని అంది. కారణం తాను నటనలో పరిణితి చెందడమేనని పేర్కొంది. ఒక కథను తన చేతికిచ్చి అందులో నువ్వు నటించనున్నావని చెప్పారంటే చాలని, ఆ కథను పూర్తిగా చదివేస్తానని చెప్పింది. ఆప్పుడే అందులోని కథా పాత్రగా మారిపోతానని అంది. ఇక కెమెరా ముందుకు వచ్చానంటే తననే కాదు, ఈ ప్రపంచాన్నే మరిచిపోతానని చెప్పింది. తాను నటించే కథా పాత్రనే జ్ఞాపకం ఉంటుందని తెలిపింది. అలా పాత్రగా మారిపోతానని అంది. అయితే తన నటనను ఎవరు అభినందించినా, దానికి కారణం తానేనని ఫలాన్ని అంతా పొందనని అంది. ఒక చిత్రం రూపొందడానికి శ్రమ, ప్రతిభ ఉంటుందని చెప్పింది. అలాంటిది తెరపై మటుకు తన లాంటి నటీమణులు, నటులనే ప్రేక్షకులు చూస్తారని, తమ వెనుక ఉండే వారి శ్రమకు గుర్తింపు లభించడం లేదని అంది. ఘనత అంతా తమకే దక్కుతోందని పేర్కొంది. తమకు లభిస్తున్న పేరు వెనుక పలువురి శ్రమ ఉందన్నది తాను గుర్తుంచుకుంటానని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు