విరాటపర్వం: ఆమె నక్సలైట్‌, రిపోర్టర్‌ కాదు..

13 May, 2020 11:01 IST|Sakshi

దగ్గుబాటి రానా-సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. విలక్షణమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌ సాయి పల్లవి బర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం విడుదలై చేసిన హీరోయిన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ పోస్టర్‌లో ఎప్పుడూ చూడని విధంగా, చాలా ఇంట్రెస్టింగ్‌గా సాయి పల్లవి కనిపించింది. ఇక ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో అమరవీరుల స్థూపం వద్ద సాయిపల్లవి చేతిలో పెన్ను, పక్కన సంచి ఉండటంతో ఆమె ఈ సినిమాలో నక్సలైట్‌ లేక రిపోర్టర్‌ కావచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో సాయిపల్లవి పోషించే పాత్ర నక్సలైట్‌ లేక రిపోర్టర్‌ కాదని ప్రజలను చైతన్య పరిచే ప్రజా గాయకురాలని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విప్లవ నాయకుడు క్యారెక్టర్‌లో కనిపించే రానా పట్ల ఆకర్షితురాలైన ప్రజా గాయకురాలిగా సాయి పల్లవి పాత్ర ఉండనుందని సమాచారం. ఇక ప్రజా గాయకురాలి పాత్ర కోసం సాయి పల్లవి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారని లీకువీరులు అంటున్నారు. అయితే సాయిపల్లవి పాత్ర గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్‌, నవీన్‌ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, సాయి చంద్‌ తదితరులు నటిస్తున్నారు. ఇక కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ చిత్రషూటింగ్‌ వాయిదా పడింది. 

చదవండి:
శ్రీమతితో తొలి సెల్ఫీ.. వైరల్‌
‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020లో’

మరిన్ని వార్తలు