అలాంటి వాటిలో నటించను

16 Apr, 2019 10:17 IST|Sakshi

సినిమా: ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాటిలో నటించను అంటోంది నటి సాయిపల్లవి. మలయాళ చిత్రం ప్రేమమ్‌తో నటిగా వికసించిన సాయిపల్లవి. ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లోకి దిగుమతి అయ్యింది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఫిదా, ఎంసీఏ చిత్రాల విజయాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక కోలీవుడ్‌లోనూ దయా, మారి–2 చిత్రాల్లో నటించినా ఎందుకనో తెలుగులో మాదిరి ఇక్కడ మార్కెట్‌ను పొందలేదు. అందుకు కారణం ఆ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోకపోవడం కావచ్చు. అయితే మారి–2 చిత్రంలో ధనుష్‌తో డాన్స్‌ చేసిన రౌడీ బేబీ పాట సూపర్‌ పాపులారిటీ  పొందింది. అలా సాయిపల్లవి తన స్థానాన్ని పెంచుకుందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం సూర్యతో రొమాన్స్‌ చేసిన ఎన్‌జీకే చిత్రం కోసం మాత్రం చాలా ఆసక్తిగా చూస్తోంది.

ఎందుకంటే ఆ చిత్రం మినహా సాయిపల్లవికి ఇక్కడ మరో అవకాశం లేదు. ఇకపోతే ఎన్‌జీకే చిత్ర సక్సెస్‌ కోసం అందులో నటించిన మరో హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ చాలా ఆశగా ఎదురు చూస్తోంది. ఈ అమ్మడికి ఈ చిత్ర విజయం చాలా అవసరం. ఈ బ్యూటీలిద్దరు ఆశలు పెట్టుకున్న ఎన్‌జీకే చిత్రం వచ్చే నెల 31వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా నటి సాయిపల్లవి ఒక భేటీలో పేర్కొంటూ సినిమాల్లోనే నటిస్తారా.. వాణిజ్య ప్రకటనల్లో నటించరా? అన్న ప్రశ్నకు వాణిజ్య ప్రకటనలంటే అందాలకు మెరుగులు దిద్దే అలంకరణ సాధనాల ప్రకటనల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నటించనని చెప్పింది. అయినా అలంకరణ సామగ్రిని వాడితే అందం మెరుగవుతుందని తాను భావించనని అంది. మేకప్‌ వేసుకుంటే వేరేవారిలా కనిపిస్తున్నట్లు తనకు కావలసిన వారు చెప్పడంతో తాను మేకప్‌ లేకండానే నటిస్తున్నానని చెప్పింది. దర్శకులు అలానే కోరుకుంటున్నారని సాయిపల్లవి పేర్కొంది.

మరిన్ని వార్తలు