సాయి పల్లవి కోరిక తీరేనా!

20 Apr, 2019 09:00 IST|Sakshi

ప్రతి వ్యక్తికీ ఏదో ఒక ఆశ, కోరిక ఉంటుంది. నటి సాయిపల్లవికి ఒక కోరిక ఉందట. వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించే నటి కాదీమె. ముఖ్యంగా కథ, తన పాత్ర నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తుంది. అలా మణిరత్నం అవకాశాన్నే నిరాకరించిందనే ప్రచారం జరిగింది. తాజాగా ఒక వాణిజ్య ప్రకటనలో నటించడానికి పారితోషికంగా రూ.2 కోట్లు ఇస్తామన్నా సారీ అని చెప్పేసిందనే టాక్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ విషయంలో నిజనిజాలు పక్కన పెడితే సాయిపల్లవి మాత్రం సెలెక్టెడ్‌ చిత్రాలు చేస్తుందన్నది మాత్రం వాస్తవమేనని చెప్పక తప్పుదు.

అయితే ఇటీవల సాయి పల్లవి మార్కెట్‌ కాస్త డల్‌ అయ్యిందన్నదీ నిజమే. కారణం సక్సెస్‌ శాతం తగ్గడమే. సాయిపల్లవికి అర్జెంట్‌గా ఒక సక్సెస్‌ చాలా అవసరం. అది సూర్యతో నటించిన ఎన్‌జీకే అందిస్తుందేమో చూడాలి. సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 31న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా సాయిపల్లవి ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను వైద్య విద్య చదివి నటినయ్యానని చెప్పింది. సినిమా రంగంలో నిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటున్నానని చెప్పింది. ఇక్కడ అవకాశాలు ఉన్నంత వరకూ నటిస్తానని, మార్కెట్‌ తగ్గితే వైద్య వృత్తి చేసుకుంటానని తెలిపింది.

తనకు ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం అని, డాన్స్‌ నచ్చుతుందని చెప్పింది. తాను తనలానే ఉండడానికి ఇష్టపడతానని అని అంది. మార్పును కోరుకోనని, అందుకే ఒకే రకం ఆహారాన్ని తీసుకుంటానని పేర్కొంది. పరిచయం ఉన్న వారితో స్నేహంగా ఉంటానని చెప్పింది. అయితే సినిమా వృత్తిలో పూర్తిగా భిన్నంగా ఉంటుందని అంది. అన్ని రకాల పాత్రలను చేయాలని ఆశ పడుతున్నానని, తాను ఇప్పటి వరకూ నటించిన ఒక్కో చిత్రం పలు విషయాలను నేర్పించాయని అంది. ఎలాంటి పాత్రనైనా నటించి మెప్పించగలనన్న నమ్మకం కలిగిందని చెప్పింది. కాగా అందరికీ ఒక మంచి సందేశానిచ్చే కథా చిత్రంలో నటించాలన్న ఆశ ఉందని నటి సాయిపల్లవి పేర్కొంది.

మరిన్ని వార్తలు