‘మహాభారతం కన్నా బాహుబలి బెటర్’

7 Jan, 2018 11:17 IST|Sakshi

ముంబై: ఇటీవల కాలంలో బాలీవుడ్ లో సెన్సార్ వివాదాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో సినిమాకు కూడా సెన్సార్ బోర్డ్ నుంచి సమస్యలు ఎదురయ్యాయి. సైఫ్ అలీ ఖాన్ హీరోగా తెరకెక్కిన కళాకాండీ సినిమాకు సెన్సార్ బోర్డ్ సభ్యులు ఏకంగా 72 కట్స్ సూచించారు. దీంతో రివ్యూ కమిటీని ఆశ్రయించిన సైఫ్ సింగిల్ కట్ తో సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ సాధించాడు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెన్సార్ సభ్యుల తీరును తప్పుపట్టిన ఈ స్టార్ హీరో సెన్సార్ బోర్డ్‌లో రాజకీయ ప్రమేయం ఎక్కువైందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో మహాభారతం లాంటి సినిమాను తీయటం కన్నా బాహుబలి లాంటి కల్పిత కథలతో సినిమాలు తీయటం బెటర్ అన్నారు. 

‘ప్రేక్షకుల కూడా చాలా సన్నితంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతీ విషయాన్ని మతానికి నమ్మకాలకు ముడిపెట్టి చూస్తున్నారు, ప్రేక్షకులతో పాటు సెన్సార్ బోర్డ్ సభ్యులకు నిజానికి, కల్పనకు తేడా తెలియటం లేదు’ అని విమర్శించారు. అక్షత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కళాకాండి సినిమాలో అక్షయ్ ఒబెరాయ్, కునాల్ రాయ్ కపూర్, దీపక్ దోబ్రియాల్, విజయ్ రాజ్, శోభితా దూళిపాల కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు