ఆ విషయం ఊహించలేనిది..

22 Jan, 2020 19:04 IST|Sakshi

అమృత సింగ్‌తో విడాకుల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ తెలిపారు. ఇప్పటికీ దానిని అసౌకర్యంగా భావిస్తానని తెలిపారు. ప్రస్తుతం జవానీ జనేమాన్ చిత్రంలో నటిస్తున్న సైఫ్‌ పింక్‌ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో నటించనున్న సైఫ్‌.. తన ముగ్గురు పిల్లల (సారా అలీఖాన్‌, ఇబ్రహీం అలీఖాన్‌, తైమూరు) గురించి కూడా మాట్లాడారు. అలాగే అమృతతో విడాకులపై కూడా స్పందించారు. 

అమృతతో విడాకులు తీసుకున్న విషయాన్ని సారా, ఇబ్రహీంలకు ఎలా చెప్పారని ప్రశ్నించగా సైఫ్‌ స్పందిస్తూ.. ‘ఇది ప్రపంచలోనే చెత్త విషయం. దీన్ని భిన్నమైన విషయంగా భావిస్తున్నాను. ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నానని ఎప్పటికీ అనుకోను. కొన్ని సంఘటనల నుంచి ఎప్పటికీ బయటపడలేమన్నా విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంద’ని భావోద్వేగానికి లోనయ్యారు.

‘కానీ వీలైనంత వరకు దీని నుంచి బయటపడి ప్రశాంతంగా ఉండటం కోసం ప్రయత్నించాను. అప్పుడు నా వయసు 20 ఏళ్లు మాత్రమే.. కుర్రాడిగా ఉన్నప్పుడే నా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. కాబట్టే నేను ఈ విధంగా చేయాల్సివచ్చిందని సమర్థించుకుంటాను. తల్లిదండ్రులు విడిపోయి రెండు కుటుంబాలుగా, వ్యక్తులుగా ఉండడమనే విషయం ఊహించలేనిదని.. అందుకే ఇప్పటికీ నేను అసౌకర్యానికి లోనవుతుంటాను’ అని సైఫ్‌ తెలిపారు.

ఇక ఆధునిక కుటుంబంగా ఉంటూనే ఒకరిపట్ల ఒకరు ఎంతో గౌరవంతో ఎలా ఉండగలుగుతున్నారన్నా మరోప్రశ్నకు.. ‘ఎలాంటి పరిస్థతుల్లో అయినా కుటుంబానికి తోడుగా ఉండాలి. అప్పుడే జీవితం అందంగా ఉంటుంది. ఒకరిపై ఒకరు ఎప్పుడూ ఫిర్యాదు చేసుకొకుండా అర్థం చేసుకుని మెలగాలి. అయితే ఇద్దరు తల్లిదండ్రులను కలిగి ఉండటమనేది గొప్పవిషయం కాకపోవచ్చు.. కానీ కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఇలాంటివి చోటు చేసుకుంటాయి’ అని సైఫ్‌ అన్నారు. స్థిరమైన ఇల్లు, మంచి కుటుంబ వాతావరణాన్ని పిల్లలకు ఇస్తే అదే మోడ్రన్‌ ఫ్యామిలీ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

చదవండి : ఆమెకు ఐదు, ఆయనకు ఆరో పెళ్లి

మరిన్ని వార్తలు