మా బంధంపై బురద చల్లొద్దు!

2 Apr, 2014 09:28 IST|Sakshi
మా బంధంపై బురద చల్లొద్దు!
‘‘ఆయన నాకు అన్నయ్య. జీవితాంతం అన్నగా అండగా ఉంటానని మాటిచ్చారు. అందుకే ఆయనకు రాఖీ కూడా కట్టాను. అలాంటి మా బంధంపై బురద చల్లడం భావ్యం కాదు’’ అని వాపోయారు మిల్కీబ్యూటీ తమన్నా. ‘హిమ్మత్‌వాలా’ చిత్ర దర్శకుడు సాజిద్‌ఖాన్‌తో తమన్నా ప్రేమాయణం నడుపుతున్నారని, ఇప్పటికే గృహస్థుడైన సాజిద్, తమన్నాను రెండో వివాహం కూడా చేసుకోవాలనుకుంటున్నాడనే వార్త బాలీవుడ్‌లో షికార్లు చేస్తోంది. మొదట్లో ఈ రూమర్‌ని తమన్నా కానీ, సాజిద్ కానీ పెద్దగా పట్టించుకోలేదు. అయితే...
 
  రాను రాను దీనికి మరిన్ని మసాలా దినుసుల్ని జత చేస్తూ... విభిన్న కథనాలను మీడియా ప్రసారం కావడం మొదలైంది. దాంతో ఖంగుతిన్న తమన్నా ఇటీవలే ఈ విషయంపై స్పందించారు. ‘‘సాజిద్ నాకు సొంత అన్నయ్య కంటే ఎక్కువ. ఇలాంటి గాలివార్తలు కుటుంబాల్లో కూడా లేనిపోని సమస్యలకు కారణం అవుతాయి. దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు’’ అన్నారు తమన్నా. మరోవైపు సాజిద్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ‘‘ఇలాంటి వార్తలు వింటుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు. తమన్నా నా చెల్లెలు. 
 
 అందుకే ఆమెతో నేను సన్నిహితంగా ఉంటున్నా. ఇంతకంటే క్లారిటీగా ఎవరూ చెప్పలేరు. ఇకనైనా ఇలాంటి గాసిప్పులకు తెర వేస్తే మంచిది’’ అని వివరణ ఇచ్చారు సాజిద్. ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు, ఒక తమిళ సినిమా, రెండు తెలుగు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు తమన్నా. బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా కోసం ఐటమ్ గాళ్ అవతారం కూడా ఎత్తారీ ముద్దుగుమ్మ. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం సమంత కథానాయిక. తనకు సాటి, పోటీ అయిన సమంత కథానాయికగా నటిస్తున్న చిత్రంలో తమన్నా ఐటమ్‌సాంగ్‌లో నర్తించడం నిజంగా విశేషమే.