నా కెరీర్‌లో ఛేంజోవర్‌... సాక్ష్యం – దర్శకుడు శ్రీవాస్‌

19 Oct, 2017 02:21 IST|Sakshi

‘‘నా గత చిత్రాలు ‘లక్ష్యం’, ‘లౌక్యం’లను దృష్టిలో పెట్టుకుని ‘సాక్ష్యం’ అని టైటిల్‌ పెట్టలేదు. కథకు యాప్ట్‌ కాబట్టి పెట్టాం. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఈ టైటిలే కరెక్ట్‌ అంటారు’’ అని దర్శకుడు శ్రీవాస్‌ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ‘సాక్ష్యం’ టైటిల్‌ని ఖరారు చేశారు. దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను పాత్రికేయులు విడుదల చేశారు.

దర్శకుడు శ్రీవాస్‌ మాట్లాడుతూ–‘‘నా మైండ్‌లో ఉన్న ఒక పాయింట్‌ ఆధారంగా ఈ కథను డెవలప్‌ చేశాను. ఎన్నో యూట్యూబ్‌ వీడియోస్, ఎన్నో స్పీచ్‌లు ఈ కథకు స్ఫూర్తి. డైరెక్టర్‌గా పదేళ్ల కెరీర్‌ తర్వాత ఓ ఛేంజోవర్‌లా ఈ సినిమా ఉండబోతోంది. బెల్లకొండ సురేశ్‌గారు సింగిల్‌ సిట్టింగ్‌లో కథ ఓకే చేశారు. ఏం చెప్పినా వెనకాడకుండా చేసే యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఖర్చుకు వెనకాడకుండా, మా మైండ్‌సెట్‌కు దగ్గరగా ఉండే ప్రొడ్యూసర్‌ అభిషేక్‌ సెట్‌ అయ్యారు’’ అన్నారు.

‘‘కథ వినగానే మన దర్శకులూ ఇలా ఆలోచిస్తారా? అనిపించింది. కథా పరంగా నేనిప్పటివరకు చేసిన మూడు సినిమాలు ఒకెత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. మా ‘సాక్ష్యం’ సినిమా బాగుంది అనడానికి ప్రేక్షకులే సాక్ష్యమవుతారు’’ అన్నారు సాయి శ్రీనివాస్‌. ‘‘ఏదైనా డిఫరెంట్‌ సినిమా చేయాలనుకుంటున్నప్పుడు మంచి కథతో శ్రీవాస్‌ దొరికారు’’ అన్నారు అభిషేక్‌. రచయిత బుర్రా సాయిమాధవ్‌తోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.

మరిన్ని వార్తలు