ముగ్గురమ్మాయిలతో..

9 Jan, 2017 01:59 IST|Sakshi
ముగ్గురమ్మాయిలతో..

ఓ కాదల్‌ కణ్మణి చిత్రంతో రొమాంటిక్‌ హీరోగా తమిళ ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి వారసుడైన ఈయన మాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న నటుడు. వాౖయె మూడి పేసు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రంగప్రవేశం చేశారు. ఆ చిత్రం మంచి పేరునే తెచ్చి పెట్టింది. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో నిత్యామీనన్ తో కలిసి నటించిన రొమాంటిక్‌ ప్రేమ కథా చిత్రం దుల్కర్‌సల్మాన్ ను మరో మెట్టు ఎక్కించింది. మణిరత్నం మరో అవకాశం ఇవ్వచూపగా దుల్కర్‌ దాన్ని అందుకోలేకపోయారు. నిజానికి కీర్తి నటిస్తున్న కాట్రు వెలియడై చిత్రంలో నటించే అవకాశం మొదట దుల్కర్‌ సల్మాన్ నే వరించింది.

ఆయన మలయాళ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఇందులో నటించలేకపోయారని సమాచారం.అంతే కాదు మరిన్ని కోలీవుడ్‌ అవకాశాలు తలుపు తట్టినా అంగీకరించని దుల్కర్‌సల్మాన్  తాజాగా ఒక నవ దర్శకుడికి పచ్చజెండా ఊపారు. ఆర్‌.కార్తీక్‌ అనే నవ దర్శకుడు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్  సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు యువళ గీతాలు పాడనున్నారట.అందులో నటి మేఘా ఆకాశ్, నివేదా పేతురాజ్‌ ఇప్పటికే ఎంపికయ్యారు. మరో నటి ఎంపిక జరుగుతుందని చిత్ర వర్గాలు తెలిపారు. మేఘా ఆకాశ్‌ ఇప్పటికే ధనుష్‌ సరసన గౌతమ్‌ మీనన్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇనై నోక్కి పాయుం తోట్టా చిత్రంలో నటిస్తున్నారన్నది గమనార్హం. ప్రస్తుతం మలయాళంలో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న దుల్కర్‌ సల్మాన్  ఈ చిత్రానికి మే నుంచి కాల్‌షీట్స్‌ కేటాయించినట్లు తెలిసింది.