ఆకట్టుకుంటోన్న ‘భారత్‌’ ట్రైలర్‌

22 Apr, 2019 15:03 IST|Sakshi

దేశంతో పాటే ఎదిగిన మనిషి కథను తెరపై ఆవిష్కరిస్తూ.. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా వస్తోన్న చిత్రం ‘భారత్‌’. పోస్టర్స్‌తోనే ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌చేసిన భారత్‌.. బాలీవుడ్‌లోనే కాక దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తోన్న చిత్రంగా బజ్‌ క్రియేట్‌ అయింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో, భిన్న వయస్కుడిగా సల్మాన్‌ నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు.

దేశానికి ఎప్పుడైతే స్వాతంత్ర్యం వచ్చిందో.. అప్పుడే నా కథ మొదలైంది అంటూ సల్మాన్‌ వాయిస్‌ ఓవర్‌తో మొదలైన ట్రైలర్‌.. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సర్కస్‌లో ఫీట్లు చేసే పాత్రలో‌, కత్రినా కైఫ్‌తో ప్రేమ సన్నివేశాల్లో, కార్మికుడిగా, నావీ ఆఫీసర్‌గా ఇలా ప్రతీ పాత్రలో సల్మాన్‌ యాక్టింగ్‌ అదిరిపోయేలా ఉంది. ప్రతి నవ్వు వెనకాల తెలియని బాధ ఉంటుందని సల్మాన్‌ చెప్పడంతో.. ట్రైలర్‌లో కనిపించనిది ఇంకా ఏదో ఉందని అర్థమవుతోంది. మొత్తానికి భారత్‌ చిత్రం సల్మాన్‌ అభిమానులకు ఈ రంజాన్‌(జూన్‌ 5)కు నిజమైన పండుగను తెచ్చేట్టు కనిపిస్తోంది.

>
మరిన్ని వార్తలు