పది కోట్లు నేలపాలు!

17 Feb, 2019 06:46 IST|Sakshi

సినిమాల్లో భారీ సెట్లను రూపొందించడం మామూలే. ఎక్కువ సందర్భాల్లో ఆ సెట్లను అలా ఉంచేసి కొద్దిమార్పులతో మరో సినిమాకు వినియోగిస్తుంటారు. కానీ సల్మాన్‌ ఖాన్‌ ‘భారత్‌’ టీమ్‌ మాత్రం 10 కోట్ల వ్యయంతో రూపొందించిన సెట్‌ను ధ్వంసం చేయాలనుకుంటోందట. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్, కత్రినా కైఫ్, దిశా పాట్నీ నటిస్తున్న చిత్రం ‘భారత్‌’. ఈ సినిమా కోసం పది కోట్ల వ్యయంతో ఓ సెట్‌ను నిర్మించారు. కథానుసారంగా క్లైమాక్స్‌లో ఈ సెట్‌ను ధ్వంసం చేయాల్సి రావడంతో సెట్‌ను కూల్చేయడానికి సిద్ధమయ్యారు. ఆమిర్‌ ఖాన్‌ తాజా చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ సినిమాకూ ఇలానే జరిగింది. ఆ సినిమా కోసం తయారు చేసిన భారీ ఓడను సినిమాలో భాగంగా నిజంగానే ధ్వంసం చేశారు. ఇప్పుడు ‘భారత్‌’ టీమ్‌ 10 కోట్లను నేలపాలు చేయబోతోంది. ఇంకో వారం రోజుల్లో సినిమా షూటింగ్‌ పూర్తి కానుందట. ఈద్‌ స్పెషల్‌గా థియేటర్స్‌లోకి ఈ చిత్రం రానుంది.

మరిన్ని వార్తలు