‘ఆ సినిమా నేను చేయాల్సింది.. కానీ..’

16 Nov, 2018 20:44 IST|Sakshi
మై నే ప్యార్‌ కియా మూవీ స్టిల్‌

‘ఆరోజు ఎందుకో సూరజ్‌ కాల్‌కు సరిగా స్పందించలేకపోయాను. అందుకే బంగారం లాంటి ఛాన్స్‌ మిస్‌ చేసుకున్నాను’  అని నటుడు పీయూష్‌ మిశ్రా పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. శుక్రవారం జరిగిన సాహిత్య ఆజ్‌ తక్‌ 2018 కార్యక్రమంలో పాల్గొన్న పీయూష్‌ మాట్లాడుతూ... తాను ‘మై నే ప్యార్‌ కియా’ సినిమాను వదులుకోవడం వెనుక ఉన్న కారణాలను చెప్పుకొచ్చాడు.

‘అసలు ఆ సినిమా ఎందుకు ఒప్పుకోలేదు నాకింకా అర్థం కావడం లేదు. సూరజ్‌ బర్జాత్యా నాకు ఆరోజు ఫోన్‌ చేశాడు. హీరోయిన్‌గా భాగ్యశ్రీని ఎంపిక చేశానని చెప్పాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీకి నిన్ను పరిచయం చేయాలనుకుంటున్నాను.. నీ అభిప్రాయం ఏమిటి? హీరో క్యారెక్టర్‌ చేసేందుకు సిద్ధమేనా అని అడిగాడు. కానీ నేను సరైన సమాధానం ఇవ్వలేకపోయాను. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా కేవలం థియేటర్‌ ఆర్టిస్టుగా ఉండిపోవడానికి సిద్ధపడి ఈ నిర్ణయం తీసుకోలేదు’  అని వ్యాఖ్యానించాడు. (మానవజాతి ఉన్నంత వరకు ఈ కథ ఉంటుంది!!)

కాగా బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ తొలి సినిమా ‘మై నే ప్యార్‌ కియా’  ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 28 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడమే కాకుండా.. ఆ దశాబ్దంలోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ ​ప్రేమకథాచిత్రంతోనే చాక్‌లెట్‌ బాయ్‌ ఇమేజ్‌తో ‘ప్రేమ్‌’గా అమ్మాయిల గుండెల్లో సల్మాన్‌ చెరగని ముద్ర వేశాడు. అంతేకాకుండా రాత్రికే రాత్రి స్టార్‌గా మారిపోయి ఇప్పటికీ తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. బహుషా ఇదంతా చూసిన తర్వాత తాను ఈ సినిమాను ఎందుకు వదులుకున్నానా పీయూష్‌ బాధ పడుతున్నాడేమో పాపం. కానీ ఎవరికి దక్కాల్సిన అవకాశాలు వారికే దక్కుతాయి కదా!

పీయూష్‌ మిశ్రా

మరిన్ని వార్తలు