మరో వీడియో షేర్‌ చేసిన సల్మాన్‌!

21 Jul, 2020 17:24 IST|Sakshi

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పన్వెల్‌లోని తన ఫాంహౌజ్‌లో సమయాన్ని గడుపుతున్న బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సోమవారం మరో వీడియోతో అభిమానులను పలకరించాడు.  పొలంలో వరినాట్లు వేసి.. పచ్చని ప్రకృతిలో సేద తీరుతున్న దృశ్యాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ‘‘వరినాటు వేయడం పూర్తైంది’’ అనే క్యాప్షన్‌తో భాయీజాన్‌ షేర్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 30 లక్షల మందికి పైగా వీక్షించారు. అయితే ఎప్పటిలాగే సల్మాన్‌ ‘వ్యవసాయం’పై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శలకు దిగుతున్నారు. అబ్బో రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే వారికి సాయం చేయాలి గానీ.. ఇలా ఎంతగా షో ఆఫ్‌ చేసినా లాభం ఉండదని చురకలు అంటిస్తున్నారు. (‘మీరు బాగా నటిస్తారు సల్మాన్‌’)

కాగా ఒళ్లంతా మట్టితో ఉన్న ఫొటోను షేర్‌ చేయగా ఇదే తరహా ట్రోలింగ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. అదే విధంగా వర్షంలో ట్రాక్టర్‌తో పొలం దున్నతున్న వీడియోను షేర్‌ చేయగా నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఇక జూన్‌ 14న బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య నేపథ్యంలో బీ-టౌన్‌ పెద్దలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. బంధుప్రీతి కారణంగానే అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సల్మాన్‌ఖాన్‌, కరణ్‌ జోహార్‌, అలియా భట్‌ తదితరులపై సోషల్‌ మీడియాలో సుశాంత్‌ ఫ్యాన్స్‌ ఈ మేరకు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాగా సల్మాన్‌ సినిమాలు రాధే, కబీ ఈద్‌ కబీ దివాళి సెట్స్‌ మీద ఉన్నాయి.  

మరిన్ని వార్తలు