నా తండ్రిని చూసి 3 వారాలయ్యింది: సల్మాన్‌

6 Apr, 2020 11:00 IST|Sakshi

ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ భయాందోళనకు గురి చేస్తోంది. ఈ మహమ్మారీ తీవ్రత దేశ వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశంలో విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొంతమంది ఎక్కడికి వెళ్లలేని పరిస్థితుల్లో చిక్కుకొని తమ కటుంబాలకు దూరంగా ఉంటున్నారు. దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ 21 రోజుల పాటు విధించిన లాక్‌డౌన్‌పై తన సొంత అనుభవాన్ని పంచుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సల్మాన్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ వీడియోలో సల్మాన్‌, తన మేనల్లుడు నిర్వాన్‌తో(సోహైల్‌ ఖాన్‌ కొడుకు)కలిసి  జరిపిన సంభాషణను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. (‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన)

ఈ వీడియోలో సల్మాన్‌ మాట్లాడుతూ.. ‘మేము కొన్ని రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. ప్రస్తుతం ఇక్కడే ఇరుక్కుపోయాం’ అని పేర్కొన్నాడు. ఈ విషయంపై నిర్వాన్‌ను ప్రశ్నిస్తూ ‘నువ్వు మీ నాన్నను చూసి ఎంతకాలమయ్యింది’ అని అడిగాడు. దీనికి నిర్వాన్‌ స్పందిస్తూ ‘మూడు వారలయ్యింది’ అని నిర్వాన్‌ బదులిచ్చాడు. అలాగే సల్మాన్‌.. ‘నేను కూడా మూడు వారాల నుంచి నా తండ్రిని చూడలేదు. మనం ఇక్కడ ఉన్నాం. అతను(తండ్రి) ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు’. అని తన ఆవేదనను వ్యక్తం చేశారు. (సల్మాన్‌ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్‌ మృతి)

నిర్వాన్‌ సల్మాన్‌తో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండటం మేలు. ఇతరులను కలవడం మానేయడం మంచిదని నేను భావిస్తున్నాను. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండటం వల్ల ఈ వైరస్‌ను వ్యాప్తి చెందకుండా ఉండవచ్చు’ అని అన్నారు. దీనికి సల్మాన్ ఏకీభవిస్తూ.. ‘లాక్‌డౌన్‌ కాలంలో భయపడిన వ్యక్తే తన ప్రాణాలను, తన చుట్టు ఉన్న వారి ప్రాణాలను కాపాడినవాడవుతాడు. వైరస్‌ తమను ఏం చేయదని నిర్లక్ష్యంగా వ్యవహరించకండి’ అని భాయిజాన్‌ సూచించాడు. ఇక సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4067కు చేరుకుందని.. 109 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరో 292 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు తెలిపింది. (25వేల మందికి స‌ల్మాన్ సాయం)

మరిన్ని వార్తలు