ప్రత్యేక విమానంలో ముంబైకి సల్మాన్..

7 Apr, 2018 18:21 IST|Sakshi

పటిష్ట భద్రతతో జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న హీరో

జోధ్‌పూర్‌ : కృష్ణ జింకల వేట కేసులో దోషిగా తేలిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ పోలీసుల పటిష్ట భద్రత మధ్య జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న నాటకీయ పరిణామాల మధ్య 50 వేల రూపాయల పూచీకత్తుపై, కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను సల్మాన్‌కు మంజూరు చేస్తున్నట్లు జోధ్‌పూర్‌ కోర్టు శనివారం మధ్యాహ్నం వెల్లడించిన విషయం తెలిసిందే. కోర్టు ఉత్తర్వుల కాపీ అందుకున్న పోలీసులు సల్మాన్‌ను పటిష్ట భద్రతతో జైలు నుంచి విడుదల చేశారు. 

సల్మాన్‌ను తీసుకెళ్లేందుకు కొందరు సన్నిహితులు జోధ్‌పూర్ జైలుకు వచ్చారు. జైలునుంచి విడుదలైన సల్మాన్‌ను పోలీసులు జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సల్మాన్ ముంబైకి బయలుదేరారు. ఒకరిద్దరు వ్యక్తిగత సిబ్బంది, సన్నిహితులు సల్మాన్‌తో ఉన్నారు. మరోవైపు కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌ కేసు తదుపరి విచారణ మే7న చేపట్టనున్నారు. 20 ఏళ్ల కిందటి కేసులో దోషిగా తేలిన సల్మాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించగా.. రూ.25 వేల విలువైన రెండు బాండ్లతో పాటు కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దన్న నిబంధనలపై సల్మాన్‌కు బెయిల్‌ మంజూరైన విషయం తెలిసిందే.


బెయిల్ అనంతరం ఎయిర్ పోర్టుకు బయలుదేరుతున్న సల్మాన్  

మరిన్ని వార్తలు