సల్మాన్ఖాన్పై రూ. 250 కోట్లకు దావా

23 Jun, 2015 15:38 IST|Sakshi
సల్మాన్ఖాన్పై రూ. 250 కోట్లకు దావా

బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్కు ఈ సంవత్సరం కలిసొచ్చినట్లు లేదు. సల్లూ భాయ్ మీద 'వీర్' సినిమా నిర్మాత విజయ్ గలానీ రూ. 250 కోట్లకు పరువునష్టం దావా వేశారు. సల్మాన్ వృత్తిపరమైన ప్రవర్తన బాగోలేదని, తనకు తీవ్ర మానసిక వేదన కలిగించాడని, పరువు మొత్తం పోగొట్టాడని గలానీ ఆరోపించారు. వీర్ సినిమా కోసం తాను సల్మాన్ ఖాన్కు రూ. 10 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. అయితే ఆ సమయానికి యువరాజ్, వాంటెడ్, ఇతర సినిమాల్లో చేస్తున్న సల్మాన్ఖాన్కు అప్పటి మార్కెట్ ప్రకారం రూ. 7-8 కోట్లు మాత్రమే ఇచ్చేవారన్నారు. సినిమా మరీ బ్రహ్మాండమైన హిట్ అయ్యి, లాభాలు ఎక్కువ వస్తే సల్మాన్కు రూ. 15 కోట్లు ఇవ్వాలని కూడా అప్పట్లో అంగీకారం కుదిరిందన్నారు.

అయితే, ఆ సినిమా వల్ల ఎలాంటి లాభాలు లేకపోయినా.. 15 కోట్లు ఇవ్వాల్సిందేనంటూ సల్మాన్ కార్యాలయం నుంచి తనపై ఒత్తిడి చేశారని గలానీ చెప్పారు. ఈ వివాదాన్ని తాను నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్తే.. సల్మాన్ తనపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ అసోసియేషన్కు ఫిర్యాదు చేశాడన్నారు. కోర్టు కూడా తన వద్ద ఉన్న ఒప్పందం పత్రాలు చూసి.. అసలు డబ్బు ఎందుకు అడుగుతున్నారని సల్మాన్ ప్రతినిధిని ప్రశ్నించినట్లు చెప్పారు. అయితే.. ఈ మూడేళ్లలో తనకు కలిగిన మానసిక వేదన అంతా ఇంతా కాదని గలానీ అన్నారు. న్యాయవివాదం కారణంగా లాయర్ల ఫీజుల పేరుతో తన డబ్బు మొత్తం ఖర్చయిపోయిందన్నారు. అందుకే సల్మాన్పై రూ. 250 కోట్ల పరువునష్టం దావా వేశానన్నారు.