కోలీవుడ్‌కు మరో ముంబయి భామ

12 May, 2014 01:14 IST|Sakshi
కోలీవుడ్‌కు మరో ముంబయి భామ

 సినిమా అనే వినోద ప్రపంచంలో పాత నీరు పోయి కొత్త నీరు రావడం అన్నది సర్వసాధారణం. అదే విధంగా కోలీవుడ్‌లోకి ఇతర భాషా భామల రాక నానాటికీ పెరుగుతూనే ఉంది. నిజం చెప్పాలంటే ఇక్కడ మాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీల హవానే ఎక్కువ. నయనతార, హన్సిక, అనుష్క, కాజల్, అమలాపాల్, లక్ష్మీమీనన్ వంటి వారు ఈ కోవకు చెందినవారే. తాజాగా సలోని అనే ముంబాయి ముద్దుగుమ్మ చేరనుంది. ఈ అమ్మడు ఇంతకు ముందు మోడలింగ్ రంగంలోను, థియేటర్ ఆర్టిస్టుగాను రాణించారట. ఇప్పుడు సరభం అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది.
 
 పిజ్జా, సూదుకవ్వుం, తెగిడి తదితర విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సి.వి.కుమార్ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం సరభం. దర్శకుడు గౌతమ్‌మీనన్ శిష్యుడు, నటుడు అనుమోహన్ కొడుకు అయిన అరుణ్ మోహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమం పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నటించడం గురించి నవ హీరోయిన్ సలోని మాట్లాడుతూ ఇది నటనకు అవకాశమున్న థ్రిల్లర్ కథా చిత్రమని చెప్పింది. దర్శకుడు కథను నెరేట్ చేసినప్పుడు తాను చాలా థ్రిల్ అయ్యానంది. పలు వైవిద్యభరిత చిత్రాలను నిర్మించి విజయం సాధించిన నిర్మాత సి.వి.కుమార్ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని సలోని అంటోంది.