‘సామజవరగమన... నిను చూసి ఆగగలనా...’ ఇప్పుడు సోషల్ మీడియా నుంచి ఫోన్ రింగ్ టోన్, కాలర్ ట్యూన్స్ వరకూ ఎక్కువగా వినిపిస్తున్న పాట ఇది. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో తమన్ స్వరపరిచిన ఈ పాట విడుదల అయినప్పటినుంచే బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను సిడ్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాట విడుదల అయినప్పటి నుంచి ఎన్నో రికార్డులను సృష్టించింది. తాజాగా ఈ పాట యూట్యూబ్లో 7 లక్షల లైక్స్ సాధించింది. ఇన్ని లైక్స్ రావడం తెలుగులో ఇదే ప్రధమం అని, ఇప్పటివరకూ ఈ పాట 40 మిలియన్ల (4 కోట్లు) వీక్షణలు పొందిందని చిత్రబృందం పేర్కొంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రానికి సహనిర్మాత: పీడీవీ ప్రసాద్.