మూడోసారి రెండు భాషల్లో...

17 Mar, 2020 00:34 IST|Sakshi
సమంత

‘‘ఇక సమంత సినిమాలకు దూరం. ప్రెగ్నెంట్‌’ అనే వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్‌ చేస్తోంది. సోషల్‌ మీడియాలోనూ ఇదే ప్రచారం జరుగుతోంది. అయితే తాజా వార్త ఏంటంటే.. సమంత ఓ సినిమాకి సైన్‌ చేశారట. ‘గేమ్‌ ఓవర్‌’ దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ చెప్పిన కథ నచ్చి, ఆమె ఈ సినిమా అంగీకరించారట. ఈ చిత్రకథ సమంత చుట్టూ తిరుగుతుందని టాక్‌. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో ‘జీన్స్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నటించనున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత చేసిన ‘యు టర్న్‌’, ‘మజిలీ’, ‘ఓ బేబీ’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

‘జాను’ ఆశించిన ఫలితం సాధించకపోయినా నటిగా సమంతకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ‘యు టర్న్‌’, ‘ఓ బేబీ’ చిత్రాలతో లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ని నడిపించగలిగే సత్తా సమంతకు ఉందని ప్రూవ్‌ అయింది. ఇప్పుడు అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో అంగీకరించిన సినిమా కూడా కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమానే అని భోగట్టా. ఇప్పటివరకూ సమంత రెండు ద్విభాషా చిత్రాల్లో చేశారు. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ఇటు తెలుగు అటు తమిళంలో ఒకేసారి రూపొందింది. అలాగే 2018లో వచ్చిన ‘యు టర్న్‌’ తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ముచ్చటగా మూడోసారి ద్విభాషా చిత్రం చేయనున్నారామె. వచ్చే నెల ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారట.

మరిన్ని వార్తలు