సమంత-చైతూ ‘థ్యాంక్‌ యూ’?

3 Jul, 2020 13:51 IST|Sakshi

ఆ హీరో, ఈ హీరోయిన్‌ జోడీ కడితే బాగుంటుందని కొందరు అనుకుంటారు. ఇక మరికొందరేమో ఇప్పటికే తెరపై కనిపించి కనువిందు చేసిన జంటనే మరిన్ని చిత్రాల్లో చూడాలనుకుంటారు. ఇలా టాలీవుడ్‌ అభిమానుల జాబితాలో మొదటి స్థానంలో ఉంటుంది రీల్‌ అండ్‌ రియల్‌ చక్కనైన జంట అక్కినేని నాగచైతన్య- సమంత. ‘ఏ మాయ చేసావే’ అంటూ తొలి చిత్రం చేసిన ఈ జోడీ ఆ తర్వాత అనేక చిత్రాల్లో జంటగా కనిపించి అభిమానులను మైమరిపింప చేశారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌ సర్కిళ్లలో తిరుగుతున్న వార్త ప్రకారం వీరిద్దరూ కలిసి మరోసారి తెరపై కనిపించనున్నారు. (కోడలు కాదు.. మామ) 

నాగచైతన్య హీరోగా విక్రమ్‌కెకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘థ్యాంక్‌ యూ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే హీరోయిన్‌ కోసం చిత్రం బృందం అన్వేషణ మొదలుపెట్టింది. అయితే ఈ చిత్రంలో చైతూ సరసన సామ్‌ నటిస్తేనే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడని సమాచారం. విక్రమ్‌ చెప్పిన డిఫరెంట్‌​ కాన్సెప్ట్‌ స్టోరీ కూడా నచ్చడంతో చై-సామ్‌లు పచ్చ జెండా ఊపినట్లు అనధికారిక వర్గాలు పేర్కొన్నాయి. (అక్కినేని ‘మనం’.. ఎన్నేళ్లైనా మరువం)

అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ‘మనం’ తర్వాత నాగచైతన్య, విక్రమ్‌ కె.కుమార్‌ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. విక్రమ్‌ దర్శకత్వంలో మనం, 24 చిత్రాల్లో సమంత నటించారు. పెళ్లి తర్వాత ఈ జంట ‘మజిలీ’లో నటించి ఆకట్టుకున్నారు. అయితే ఈ చిత్రంతో పాటు వీళ్లిద్దరు కలిసి నందిని రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టు టాక్‌. అయితే ఈ క్రేజీ జంట మరో సారి తెరపై కనిపిస్తున్నారనే వార్త రావడంతో అక్కినేని ఫ్యాన్స్‌ పండగ మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ చేస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు