కథానాయికలే కష్టపడుతున్నారు!

8 Sep, 2019 09:40 IST|Sakshi

తను అనుకున్నది నిర్భయంగా చెప్పే అతికొద్ది మంది హీరోయిన్లలో నటి సమంత ఒకరు. నటిగా సక్సెస్‌ అవడమే కాదు, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలోనూ విజయం సాధించిన నటి సమంత. నటుడు నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అటు సంసార జీవితాన్ని, ఇటు నట జీవితాన్ని సంతోషంగా గడిపేస్తున్న సామ్‌ ఇటీవల కుటుంబసభ్యులతో కలిసి విదేశీ విహార యాత్రకు వెళ్లింది. అక్కడు ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది.

ఆ గ్లామరస్‌ ఫొటోలను చూసిన ఒక వర్గం విమర్శలు చేసినా, యూత్‌ మాత్రం ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అలా మరోసారి వార్తల్లో నానుతున్న సమంత ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు సంసార జీవితంలో ఏ విషయంలోనైనా సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కల్పించారని చెప్పింది. వరుసగా సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటిస్తున్నందుకు ప్రశంసలు కురిపిస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది. నిజంగానే వరుసగా విజయాలను అందుకోవడం సంతోషంగా ఉందని, తన చిత్రాలను ప్రేక్షకులు ఆదరించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపింది.

అందంగా ఉన్నంత మాత్రాన సినీ రంగంలో స్థానాన్ని పదిలం చేసుకోవచ్చుననే పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పింది సమంత. మరో విషయం ఏమిటంటే  కథానాయకుల కంటే కథానాయికలే ఎక్కువగా కష్టపడుతున్నారని పేర్కొంది. అదేవిధంగా సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించడం వల్ల తన విజయరహస్యం తెలిసిపోయిందని భావించరాదని... దాన్ని తెలుసుకోవడం ఎవరి వల్లా సాధ్యంకాదని అంది. ఇకపోతే తాను దర్శకత్వం వహించనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పింది.

అయితే భవిష్యత్‌లో నిర్మాతగా మారి మహిళలకు ప్రాముఖ్యత కలిగిన మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న ఆశ ఉందని అందుకే కచ్చితంగా నిర్మాతగా మారతానని చెప్పింది. ఈ తరం మహిళలు స్వతంత్రంగా జీవిస్తున్నారని పేర్కొంది. సమంత నటనకు విరామం ఇవ్వనుంది, పిల్లలను కనాలని నిర్ణయించుకుంది లాంటి వదంతులు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. అవన్నీ ఒట్టి వదంతులే కొట్టిపారేసింది సామ్‌. ప్రస్తుతం ఈ అమ్మడు 96 తమిళ చిత్రం తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. అదే విధంగా ఒక వెబ్‌ సిరీస్‌లోనూ నటించడానికి పచ్చజెండా ఊపింది.

>
మరిన్ని వార్తలు