ట్రోల్స్‌పై నోరు విప్పిన సామ్‌

18 Jun, 2019 16:34 IST|Sakshi

టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు చెన్నై సుందరి సమంత. ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌గా ఉంటూ అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే  సమంతను ఆరాధించే అభిమానులు ఉన్నట్టే ద్వేషించే వారూ చాలా మందే ఉన్నారు. తను సోషల్‌ మీడియాలో చేసే కొన్ని పోస్టులకు ఘాటైన విమర్శలను ఎదుర్కొన్నారు. అయినా నాకు ట్రోలింగ్స్‌ కొత్తేమీ కాదంటూ సమంత పాజిటివ్‌గా స్పందించారు. సమంత మాట్లాడుతూ ‘మొదట్లో ట్రోలింగ్‌ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. వాటి గురించి ఆలోచించినపుడు పిచ్చిదాన్నైపోతానేమో అనిపించింది. వాటివల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటానేమోనని భయం వేసింది. కానీ ఇపుడు దాన్నుంచి నేను బయటపడ్డాను’. ఏ ట్రోల్స్‌ వల్లైతే బాధపడ్డానో ఇప్పుడు వాటిని చూసే నవ్వుకుంటున్నా అన్నారు. ట్రోల్స్‌ను కూడా ఎంజాయ్‌ చేస్తున్నా అంటున్నారు ఈ బేబీ.

"నేను ట్వీట్ చేసినా, చిత్రాన్ని పోస్ట్ చేసినా తర్వాత ఏదో ఒక ట్రోల్‌ జరుగుతుందని నాకు తెలుసు. నేను ఏది పోస్ట్‌ చేసినా దానిపై విమర్శలు చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు" అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సమంత నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కొరియన్‌ సినిమా ‘మిస్‌ గ్రానీ’కి ఇది రీమేక్‌. ఈ సినిమాలో సమంత 70 సంవత్సరాల వృద్ధురాలి నుంచి 20 ఏళ్ల యువతిగా మారిన పాత్రలో కనిపించనున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్‌ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు