ఎంత నమ్మకమో!

7 Aug, 2018 10:54 IST|Sakshi

తమిళసినిమా: తక్కువ చిత్రాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న నటి సమంత. అంతే కాదు కన్న కలల్ని, కోరుకున్న వాటిని సాధించుకున్న నటి ఈ బ్యూటీ. సమంతలో ఆత్మ విశ్వాసం అధికం కావడానికి ఇవన్నీ కారణం కావచ్చు. చెన్నై పుట్టినిల్లు, హైదరాబాద్‌ను మెట్టినిల్లు చేసుకుని నటిగానూ, అర్థాంగిగానూ ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్న సమంత లాంటి వారు అరుదనే చెప్పాలి. వివాహానంతరం అగ్రనటిగా రాణిస్తున్న ఈ అమ్మడు వరుస విజయాలను అందుకుంటున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సుందరికి పిచ్చ పాపులారిటీ ఉంది. అందుకే తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న యూ టర్న్‌ చిత్రంలో నటిస్తున్నారు.

ఈమెను హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల నాయకిగా ప్రమోట్‌ చేసిన చిత్రం ఇదే. కన్నడంలో సంచలన విజయాన్ని సాధించిన యూ టర్న్‌ చిత్రానికి ఇది రీమేక్‌. తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా సీమరాజా చిత్రంలోనూ సమంత నాయకిగా నటిస్తున్నారు. ఇంతకుముందు సమంత నటించిన నడిగైయార్‌ తిలగం (తెలుగులో మహానటి), విశాల్‌కు జంటగా నటించిన ఇరుంబుతిరై ఒకే రోజు విడుదలయ్యాయి. ఆ రెండు చిత్రాలు విశేష ప్రేక్షకాదరణను పొందాయి. తాజాగా అలాంటి పరిస్థితి రిపీట్‌ కానుంది. సమంత నటించిన యూ టర్న్, సీమరాజా చిత్రాలు రెండూ సెప్టెంబరు 13న తెరపైకి రానున్నాయి. యూటర్న్‌ చిత్రంలో సమంత పత్రికా విలేకరిగా నటించారు. సీమరాజా గ్రామీణ నేపథ్యంలో సాగే కథా చిత్రం.

ఈ రెండు చిత్రాలు ఒకే రోజున తెరపైకి రానుండటం గురించి సమంత ఏమంటున్నారో చూద్దాం. యూ టర్న్, సీమరాజా రెండూ వేర్వేరు కథాంశాలతో కూడిన చిత్రాలు. యూ టర్న్‌ ఒక హత్య నేపథ్యంతో కూడిన కథా చిత్రం. సీమరాజా గ్రామీణ నేపథ్యంతో సాగే కథా చిత్రం. కాబట్టి రెండు చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని పేర్కొన్నారు. ఈ రెండు చిత్రాలపై ఎంత నమ్మకం లేకపోతే సమంత అంతగా చెబుతారు. ఈ బ్యూటీ నమ్మకం వమ్ము కాకూడదని కోరుకుందాం.

మరిన్ని వార్తలు