నా మనసు చెబుతోంది!

16 Mar, 2019 00:22 IST|Sakshi

‘‘నాదైన దారిలో జీవితంలో ముందుకు వెళ్లడానికి నాకు సహకరిస్తున్న ఆ దేవుడికి, నా శ్రేయోభిలాషులకు, ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా జీవితంలో నేను ఎదగడానికి కాస్త సమయం పట్టింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశాను. కానీ ఇప్పుడు ఎదుగుదలకు సంబంధించిన తృప్తిని ఆస్వాదిస్తున్నాను’’ అన్నారు సమంత. ఇప్పటివరకూ ఎన్నో మంచి పాత్రలు చేశారు సమంత. తాజాగా మనసుకి తృప్తినిచ్చిన మరో పాత్రను ‘ఓ బేబి’ సినిమాలో చేశారు. ఈ సందర్భంగానే సమంత పై విధంగా పేర్కొన్నారు. ఇంకా సమంత మాట్లాడుతూ – ‘‘ఓ బేబి’ నాకు ఎంతో ప్రత్యేకమైనదని నా మనసు చెబుతోంది.

నాకు ఎంతో ప్రీతిపాత్రమైన పాత్రను ఈ సినిమాలో నాతో చేయించిన దర్శకురాలు నందినీరెడ్డికి ధన్యవాదాలు’’ అన్నారు. నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం ‘ఓ బేబి’. ఎంత సక్కగున్నావే అనేది ఉప శీర్షికగా అనుకుంటున్నారట. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు సమంత పేర్కొన్నారు. 2014లో వచ్చిన సౌత్‌ కొరియన్‌ చిత్రం ‘మిస్‌ గ్రానీ’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. ఇందులో సీనియర్‌ నటి లక్ష్మీ, నాగశౌర్య కీలక పాత్రల్లో నటించారని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే.. పెళ్లి తర్వాత  నాగచైతన్య, సమంత కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన ‘మజిలీ’ చిత్రం వచ్చే నెల 5న విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు