సితారలు దిగి వచ్చిన వేళ...!

21 Jul, 2018 01:06 IST|Sakshi
సితార బర్త్‌డే సెలబ్రేషన్స్‌

సుధీర్‌బాబు, అదితీరావ్‌ హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సమ్మోహనం’. జూన్‌లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి. చిన్నపిల్లల సృజనాత్మకత పెరుగుదల కోసం సుధీర్‌బాబు ఈ సినిమాలో ‘తారలు దిగి వచ్చిన వేళ’ పుస్తకాన్ని రాస్తారు. ఈ పుస్తకాన్ని ప్రచురించే ‘అనగనగా’ సంస్థ అధిపతిగా ఉన్న తనికెళ్ల భరణి కంటెంట్‌ను చదు వుతారు. ఈ సీన్‌ సినిమాలో హైలైట్‌.

నిజంగా కూడా ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకు రావాలనుకున్నారు. ముందుగా ఈ పుస్తకాన్ని నటుడు చిరంజీవికి చిత్రబృందం అందజేయడం జరిగింది. ఇప్పుడు ఈ పుస్తకం మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. చిల్డ్రన్‌ కామిక్‌ నేపథ్యంలో రూపొందిన ఈ పుస్తకం తొలి కాపీని శుక్రవారం మహేశ్‌ బాబు కుమార్తె సితారకు చిత్రబృందం ఇచ్చింది. శుక్రవారం సితార పుట్టినరోజు. ‘‘సితార’లు దిగివచ్చిన వేళ.. మార్కెట్‌లోకి ఈ బుక్‌ రిలీజైంది.

సితారకు జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ సితార ఆ బుక్‌ను పట్టుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేశారు సుధీర్‌బాబు. ‘‘సమ్మోహనం’ టీమ్‌ తరఫున సితారకు ఆరవ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ కథను తనికెళ్ల భరణిగారు చదివిన విధానం, దానికి ప్రముఖ చిత్రకారుడు పీయస్‌ చారిగారు వేసిన అద్భుతమైన బొమ్మలు, ‘సమ్మోహనం’ సినిమా క్లైమాక్స్‌లోని నటన, సంగీతం.. అన్నీ కుదిరాయి. ఈ కథ, బొమ్మలూ చిన్న పిల్లలకీ, పెద్దలకీ బాగా నచ్చుతాయనే నమ్మకంతో పుస్తకంగా అందిస్తున్నాను’’ అని పేర్కొన్నారు ఇంద్రగంటి.
 

మరిన్ని వార్తలు