సినిమా వాళ్ల మీదకొస్తే చూస్తూ ఊరుకోం..!

7 Apr, 2014 23:25 IST|Sakshi
సినిమా వాళ్ల మీదకొస్తే చూస్తూ ఊరుకోం..!
 ‘తెలంగాణలో కోటిన్నరమంది. సెటిలర్స్ ఉన్నారు. వాళ్లకు గనుక కోపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. తెలంగాణ వాదులు అక్కడి దాకా తెచ్చుకోవద్దు’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ హెచ్చరించారు. ఇటీవలే విడుదలైన ‘హృదయ కాలేయం’ చిత్రం దర్శకుడు స్టీవెన్ శంకర్, హీరో సంపూర్ణేష్‌బాబులపై కొందరు తెలంగాణ వాదుల దాడిని  ఖండిస్తూ ఆయన ఈ రకంగా స్పందించారు. ‘‘తెలంగాణ వ్యక్తిని హీరోగా పెట్టి వ్యంగ్యంతో కూడిన కామెడీ సినిమా తీస్తావా? అని స్టీవెన్ శంకర్‌ని కొట్టడం సబబైన పని కాదు. 
 
 తెలంగాణ వాడైన సంపూర్ణేష్‌బాబుకి ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటప్పుడు దర్శకుడు స్టీవెన్‌శంకర్‌ని అభినందించాలి కానీ... కొట్టడం ఎంతవరకు సమంజసం. మరోసారి సినిమావాళ్ల మీదకొస్తే... చూస్తూ ఊరుకోం. అన్ని రాజకీయ పార్టీలూ ఈ దాడిని ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే... భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని భయం వేస్తోంది. సినిమాలకు ప్రాంతాలతో సంబంధం లేదు. అన్ని ప్రాంతాలూ సినిమాకు సమానమే. తెలుగువారందరూ అన్నదమ్ముల్లా సామరస్యంగా ఉండాలనేది మా అభిమతం’’ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్.
 
>